- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైతన్నకు కలిసిరాని ఎర్ర బంగారం

దిశ ,హాలియా: ప్రస్తుత సీజన్ లో మిర్చి రైతులు మద్దతు ధర లేక ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరం మిర్చి రికార్డు స్థాయిలో ధరలు నమోదు కావడంతో ఈ సీజన్ లో రైతులు అత్యధికంగా మిర్చి సాగు వైపు మొగ్గు చూపారు. దీంతో మిర్చి రైతులు మద్దతు ధరపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అడియాశలయ్యాయి. గత సంవత్సరం మిర్చి ధర క్వింటాలుకు గరిష్టంగా రూ.35వేలు పలకడంతో రైతన్నలు ఈ సంవత్సరం కూడా తమకు కలిసి వస్తుందేమో అని ఆశతో మిర్చి సాగు చేసినప్పటికీ రైతులు ఆశించినంతగా మద్దతు ధర దక్కకపోగా మిర్చి దిగుబడి సైతం గత సంవత్సరం కంటే 50 శాతానికి పైగా పడిపోయింది. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి చేతికి అందే పరిస్థితి లేదని ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు మిర్చి ఎగుమతి పై నిబంధనలు ఉండటంతో మిర్చి ధర అమాంతం పడిపోయింది. ప్రస్తుత సీజన్లో కూలీలు ధరలు కూడా పెరగడంతో పెట్టుబడి అధికమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పడిపోయిన మిర్చి ధర..
ఈ సీజన్ లో రైతు కళ్లం దగ్గర మిర్చి అమ్ముకునే సమయానికి తాజాగా క్వింటాలుకు రూ.10వేలకు పడిపోవడంతో కౌలు రైతుకు అప్పులే మిగిలే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా స్థానికంగా మార్కెట్ సదుపాయం లేకపోవడంతో మధ్య వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకు వ్యాపారులు కొనడంతో రైతు ధర అమాంతం తగ్గిపోతుంది. మిర్చి సాగుకు ఎకరానికి రూ.1.50లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అవుతుందని దిగుబడి మాత్రం ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ల లోపు దిగుబడి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర అమాంతం పడిపోవడంతో కౌలు రైతుకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీల ధరలు పెరుగుతుండడంతో అదనపు ఖర్చులు అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఐదు ఎకరాల మిర్చి పంట సాగు చేసే రైతు సుమారు రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దిగుబడి తగ్గిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం వచ్చే ప్రమాదం ఉందని మార్కెట్లో ధర రాకపోవడంతో నష్టాల బారిన పడుతున్నామని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
హాలియా వ్యవసాయ సబ్ డివిజన్ లో 3800 ఎకరాల్లో మిర్చి సాగు..
ప్రస్తుత సీజన్ లో హాలియా వ్యవసాయ సబ్ డివిజన్లో 3800 ఎకరాల్లో మిర్చి సాగు చేసినట్లుగా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కాగా గత సంవత్సరం కంటే సుమారు వెయ్యి ఎకరాల్లో అదనపు సాగు చేసినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. గత సంవత్సరం ఉన్నత ధరలను బేరేజ్ వేసుకుని రైతులు ప్రస్తుత సీజన్ లో మిర్చి సాగుకు ముందుకు వచ్చారు. అంతేకాకుండా గత సంవత్సరంలో ఎకరాకు 20 నుండి 25 క్వింటాళ్ల మిర్చి దిగుబడి రాగా ప్రస్తుత సీజన్ లో సగానికి పైగా పడిపోయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దిగుబడి తగ్గిందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తేజ రకం వైపే రైతులు మొగ్గు...
ప్రస్తుత సీజన్ లో మిర్చి రైతులు ఎగుమతికి అనుకూలంగా ఉండే తేజ రకం వైపే మొగ్గు చూపారు. సుమారు 2 వేల ఎకరాల్లో తేజ రకం సాగు చేయగా ఆర్మూర్, బుల్లెట్, షార్క్, దివ్య, నెంబర్ 5, ఎన్ఎస్ 1701, సోనాల్ ,దేవసేన తదితర రకాల మిర్చి పంటను సాగు చేశారు. వీటిలో అధిక దిగుబడి వచ్చే తేజ రకం ధర లేకపోవడంతో రైతులకు నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రకాల మిర్చి దిగుబడిలో సైతం ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు గడ్డెక్కే పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర రూ.15 వేల కైనా చేరితే కొంత ఊరట లభిస్తుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి పెరిగింది..దిగుబడి తగ్గింది : పిల్లి రాజేష్ రైతు
ప్రస్తుత సీజన్ లో మూడు ఎకరాల మిర్చి సాగు చేశాను. మిర్చి పంటలకు వాడే పెస్టిసైడ్స్ ధరలు పెరగడంతో పాటు కాంప్లెక్స్ యూరియా తదితర ఎరువులు అధికంగా పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే 700 మంది వ్యవసాయ కూలీలను ఉపయోగించాం. ఎకరానికి రూ. 2లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. దిగుబడి ఎకరానికి 12 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. దీంతో నష్టం వాటిల్లే అవకాశం ఉంది.