రియల్ దందా..అనుమతులు లేకుండానే అమ్మకాలు..

by Aamani |
రియల్ దందా..అనుమతులు లేకుండానే అమ్మకాలు..
X

దిశ, నల్లగొండ బ్యూరో బ్యూరో / మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడలో రియల్ దందా జోరుగా సాగుతోంది. అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా వెంచర్లు చేస్తున్నారు. లే అవుట్ అనుమతులు లేకపోయిన బ్రోచర్ లో ఉన్నట్లు ముద్రించి మయ చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించి వెంచర్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వెంచర్లో మురికి కాలువల నిర్మాణం , రోడ్లు ,విద్యుత్ ఏర్పాటు , నీటి ట్యాంక్ వంటి పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా విక్రయిస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అంటగడుతున్నారు. అధికారులు అక్రమ వెంచర్ల పై దృష్టి సారించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిర్యాలగూడ పట్టణం లో రియల్ వ్యాపారులు ఆడిందే ఆట...‌ పాడిందే పాటగా సాగుతుంది. ప్రభుత్వ అనుమతులతో పని లేకుండా దందా సాగిస్తున్నారు. గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అధికారులు మాత్రం వెంచర్ల వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.

అంతా బ్రోచర్ మాయ..

లే అవుట్ అనుమతులు లేకపోయినా బ్రోచర్ లో అనుమతులు ఉన్నట్లు ముద్రించి మయ చేస్తున్నారు. వెంచర్లో మురికి కాలువల నిర్మాణం , రోడ్లు ,విద్యుత్ ఏర్పాటు , నీటి ట్యాంక్ వంటి పూర్తి స్థాయి లో సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా వెంచర్ ఏర్పాటు లో భాగంగా మొత్తం విస్తీర్ణంలో 10 శాతం భూమిని మున్సిపాలిటికి మార్టిగేజ్ చేయాల్సి ఉన్న చేయకుండా అమ్మకాలు చేస్తున్నారు.

అనుమతులు లేకుండా అమ్మకాలు..

మిర్యాలగూడ పట్టణం లోని బంగారుగడ్డ సమీపంలో అద్దంకి నార్కట్ పల్లి రహదారి పక్కన ఆర్ కె టౌన్ షిప్ పేరుతో ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్ పనులు చేస్తున్నారు. సర్వే నెంబర్ 902 లో సుమారు 31 ప్లాట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో వెంచర్ చేయకుండానే ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయిస్తున్నారని ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి లే అవుట్ అనుమతులు తీసుకొకుండా విక్రయాలు చేపడుతున్నారు. సదరు వెంచర్ వ్యాపారులు ఇప్పటికే సగం ప్లాట్ అమ్మినట్లు ప్రచారం చేస్తూ కొనుగోలు దారులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

పట్టించుకొని మున్సిపాలిటీ అధికారులు..

అక్రమ వెంచర్లు చేసి అనుమతులు లేకుండా ప్లాట్ అమ్మకాలు చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక రియల్ వ్యాపారుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయాల మాదిరిగా సాగుతుందని విమర్శలు వస్తున్నాయి. అక్రమ వెంచర్ల పై దృష్టి సారించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇరిగేషన్ కాలువ ఆక్రమణ.. ?

902 సర్వే నెంబర్ లో ఇరిగేషన్ కు చెందిన భూమి ఉన్నది. అయితే ఆ కాల్వ భూమిని ఆక్రమించుకొని వెంచర్ చేశారనే ప్రచారం జరుగుతుంది. పంట పొలాలకు సాగు నీరందించే చిన్న కాల్వలను ఆక్రమించారనే స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అనుమతి ఇవ్వలేదు : మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య..

బంగారుగడ్డ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఆర్ కె టౌన్ షిప్ లే అవుట్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దరఖాస్తు మాత్రమే చేసుకున్నారు. అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.



Next Story