- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రియల్ నీలినీడలు..! అక్రమ దందాపై మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం

హుజూరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పట్టణంలో జరుగుతున్న అక్రమ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్కు పంపారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు హుటాహుటిన నివేదిక పంపడంతోపాటు ఇప్పుడు రీయల్ ఎస్టేట్ వ్యాపారులు కార్యాలయంలో అడుగు పెడితే చాలు ముఖం చాటేస్తున్నారని సమాచారం. దీంతో ఈ వ్యాపారంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
అమాయక జనాన్ని నమ్మించి లే అవుట్ లేని ప్లాట్లను విక్రయిస్తే అనంతరం వారు పర్మిషన్లు రాక నానా అవస్థలు పడుతున్నారు. అక్రమ లే అవుట్లతోపాటు ప్రభుత్వ, శ్మశాన వాటికలు కబ్జా చేసి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రూ.కోట్ల సంపాదనను ఆర్జిస్తున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు నాలా కన్వర్షన్లు, రిజిస్ట్రేషన్లు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.
ఇటీవల హుజూరాబాద్ ప్రాంతంలో పదుల సంఖ్యలో అక్రమ రియల్ వెంచర్లు వెలిశాయని, రియల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లుతోందని విమర్శలు వ్యక్తం అయ్యాయి. అధికార పార్టీ నుంచి రాజకీయ ఒత్తిళ్లు, అమ్యామ్యాలకు ఆశపడి అనుమతులు ఇవ్వడం, రిజిస్ట్రేషన్లు చేయడం కూడా అక్రమ వ్యాపారానికి కారణమనే విమర్శలు వినిపించాయి. - దిశ, హుజూరాబాద్
దిశ, హుజూరాబాద్ : హుజురాబాద్లో రియల్ ఎస్టేట్ అక్రమ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్కు పంపారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరడంతో అధికారులు హుటాహుటిన నివేదిక పంపడంతోపాటు ఇప్పుడు రీయల్ ఎస్టేట్ వ్యాపారులు కార్యాలయంలో అడుగు పెడితే చాలు ముఖం చాటేస్తున్నారని సమాచారం. దీంతో ఈ వ్యాపారంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అమాయక జనాన్ని నమ్మించి లే అవుట్ లేని ప్లాట్లను విక్రయిస్తే అనంతరం వారు పర్మిషన్లు రాక నానా అవస్థలు పడుతున్నారు. అక్రమ లే అవుట్లతోపాటు ప్రభుత్వ, శ్మశాన వాటికలు కబ్జా చేసి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, రూ.కోట్ల సంపాదనను ఆర్జిస్తున్నారని తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు నాలా కన్వర్షన్లు, రిజిస్ట్రేషన్లు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల హుజూరాబాద్ ప్రాంతంలో పదుల సంఖ్యలో అక్రమ రియల్ వెంచర్లు వెలిశాయని, రియల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లుతోందని విమర్శలు వ్యక్తం అయ్యాయి. అధికార పార్టీ నుంచి రాజకీయ ఒత్తిళ్లు, అమ్యామ్యాలకు ఆశపడి అనుమతులు ఇవ్వడం, రిజిస్ట్రేషన్లు చేయడం కూడా అక్రమ వ్యాపారానికి కారణమనే విమర్శలు వచ్చాయి.
మున్సిపల్ తీర్మానంతో...
హుజూరాబాద్లో అక్రమ రియల్ వ్యాపారంపై గత నెలలో హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిల్లో చర్చ జరిగింది. అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణంగా మున్సిపాలిటీకి రావాల్సిన 10శాతం భూమి రావడం లేదని, అక్రమ వెంచర్లలో రియల్టర్లు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, అధిక ధరలకు ప్లాట్లు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నాన్ లే అవుట్ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయమై కలెక్టర్ స్థానిక అధికారులను విచారణకు ఆదేశించారు.
అక్రమ లేఅవుట్లు నిజమే..
హుజూరాబాద్ పట్టణంతోపాటు శివారు భూముల్లో మున్సిపల్ అనుమతి లేకుండా అక్రమ వెంచర్లు నిర్వహిస్తున్న విషయం వాస్తమేనని తెలిపారు. తమకు తెలియకుండానే రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూమిని నివాసయోగ్య భూమిగా నాలా కన్వర్షన్ (నాన్ అగ్రికల్చర్ లాండ్ అసెస్మెంట్) చేస్తున్నారని, ఇలా నాలా కన్వర్షన్ చేసిన భూముల్లోని, వెంచర్లలోని ప్లాట్లను మున్సిపల్ అనుమతి లేకుండా లే అవుట్ చేయకుండానే రియల్ వ్యాపారులు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. తద్వారా మున్సిపాలిటీకి నష్టం జరుగుతోందని అధికారులు నివేదించారు.
మున్సిపాలిటీకి చెందాల్సిన 10శాతం భూమి రియల్ వ్యాపారులు ఇవ్వడం లేదని, దీని విలువ రూ.కోట్లలో ఉంటుందని, అలాగే రూ.కోట్ల విలువ చేసే మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం రోడ్లు వేయడం లేదని, తద్వారా భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కలెక్టర్కు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి కూడా జిల్లా కలెక్టర్కు నివేదిక, వివరణ సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కలెక్టర్ ఆయా శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
మూడు శాఖల మధ్య సమన్వయ లోపం!
హుజూరాబాద్లో రెవెన్యూ, మున్సిపల్, సబ్ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అక్రమ వ్యాపారాలు, అక్రమ నాలా కన్వర్షన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు అక్రమంగా రియల్ వ్యాపారం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కలెక్టర్కు నివేదించినట్లు తెలుస్తోంది.
తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నాలా కన్వర్షన్లు, అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని, ఈ విషయమై ఆ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ కోరినట్లు తెలుస్తోంది. మున్సిపల్ పరిధిలో 2020 ఆగస్టు తర్వాత అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన వెంచర్లలోని ప్లాట్లలో గృహ నిర్మాణ అనుమతి ఇచ్చేది లేదని ఒకవైపు మున్సిపల్ అధికారులు చెప్తున్నా రిజిస్ట్రేషన్లు ఆగడం లేదు.
అధికారుల వెనకడుగు?
ఇదిలా ఉంటే.. హుజూరాబాద్లో రియల్ వ్యాపారంపై కలెక్టర్ దృష్టి పెట్టిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రియల్ వ్యాపారులు తమ కార్యాలయాల్లో అడుగుపెడితేనే రెవెన్యూ, మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సిబ్బంది జంకుతున్నారు. ఇటీవల కొందరు రియల్ వ్యాపారులు నాలా కన్వర్షన్ కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లగా వివాదాస్పద భూముల్లో నాలా కన్వర్షన్ చేసేది లేదని అధికారులు కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారం విషయమై కలెక్టర్ సీరియస్గా ఉన్నారని, ఒకవేళ ఆన్ లైన్లో దరఖాస్తు పెట్టుకున్నా చేసేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయమై రియల్టర్లు ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే నాన్ లే అవుట్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే హుజూరాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ వెనకడుగు వేస్తున్నారు. కేవలం నాలా కన్వర్షన్ ఉంటే ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు? లే అవుట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి కదా? ప్రభుత్వ నిబంధనలు అధికారులే బేఖాతర్ చేస్తే ఎలా? అని స్వయంగా మున్సిపల్ అధికారులే పేర్కొంటుండడంతో.. ఈ వ్యవహారం ఎటు వెళ్తుందోననే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.
ఏది ఏమైనా.. హుజూరాబాద్లో అక్రమ రియల్ వ్యాపారంపై విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వివాదాస్పద భూములు నాలా కన్వర్షన్ చేసేందుకు, అలాగే అక్రమ లే అవుట్లలోని భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ అధికారులు వెనకడుగు వేస్తున్నారు. కాగా రియల్టర్లు నాలా కన్వర్షన్ కోసం కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది.