వానాకాలం సాగుకు సన్నద్ధం..పెరిగిన పంట రుణ పరిమితి

by Aamani |
వానాకాలం సాగుకు సన్నద్ధం..పెరిగిన పంట రుణ పరిమితి
X

దిశ,నల్లగొండ బ్యూరో : రానున్న వానాకాలం పంటల సాగు లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈసారి ఏ పంటలు ఏ స్థాయిలో పండించాలో... వాటికి సంబంధించిన విత్తనాలు, ఎరువులు పంట రుణాలు అన్నింటిని సిద్ధం చేస్తూ ప్రణాళిక విడుదల చేసింది. ముందస్తుగానే పంటల సాగు కోసం వ్యవసాయ అధికారులు నుంచి రైతులు ఎలాంటి మెలకువలు తెలుసుకోవాలో కూడా ముందస్తుగానే అన్నదాతలను సిద్ధం చేయనున్నారు.

పంట సాగు 20 లక్షల ఎకరాలకు పైనే

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట సాగు లక్ష్యం దాదాపు 20 లక్షల ఎకరాలకు పైనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల పంట సాగు, సూర్యాపేటలో 4.98 లక్షల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4.50లక్షల ఎకరాల సాగు చేయనున్నారు. అయితే ఈ మొత్తం పంట సాగులో 8 లక్షల ఎకరాల వరకు కేవలం పత్తి పంటని సాగు చేయనున్నారు. నల్లగొండలో 5.25లక్షల ఎకరాలు, సూర్యాపేట లో 1.50లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1.15లక్షల ఎకరాల సాగు చేయనున్నారు. అయితే పత్తి పంట సాగునీటి వనరులేని ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు,నల్లగొండ,భువనగిరి,వలిగొండ,ఆలేరు తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున సాగు చేయనున్నారు. ఈ పంట కేవలం వర్షాధారిత పంట మాత్రమే. ఉమ్మడి జిల్లాలో వరి పంట తర్వాత సాగయ్యే రెండో పంట పత్తి పంట మాత్రమే. అయితే మన జిల్లాలో వరి పత్తి తో పాటు కందులు, జొన్నలు , ఆముదం, పెసర్లు, చెరుకు, ఉల్లిగడ్డలు, మిర్చి, నువ్వులు, మినుము పంటలతో పాటుగా ఇతర పంటలను సాగు చేస్తున్నారు.

పెరిగిన పంట రుణ పరిమితి ..

అన్నదాతలకు పంటల సాగు కోసం ప్రతి ఏటా ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణాలను అందజేస్తుంది. పంటల వారీగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2025--2026 సంవత్సరానికి పంటల రుణ పరిమితిని పెంచింది. అయితే సాగునీటి వసతి కలిగిన పంటల సాగుకు, వర్షాధారిత పంటలకు వేరువేరుగా పంట రుణ పరిమితిని పెంచారు. సాగు చేసే ప్రతి పంటకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

2024-2025 ఎకరానికి పంట రుణం పరిమితి

వరి --- 36000--50000

పత్తి --- 44000-46000

జొన్నలు --17000--20000

కందులు -- 19000--23000

నువ్వులు --- 15000--21000

పల్లీలు ---- 24000--30000

ఆముదం ----17000-21000

పెసళ్లు---- 16000--22000

చెరుకు --- 64000-80000

మిర్చి ---- 82000-84000

పొగాకు --- 33000--35000

టమాటా --- 33000--40000

ఉల్లిగడ్డ -- 43000--45000

2025--2026 ఏడాదికి ఎకరానికి పెంచిన పంట రుణం పరిమితి ఇలా..

వరి-- 36000--50000

పత్తి ---46000--48000

కందులు --20000--25000

జొన్నలు ---17000--26000

పెసళ్లు--17000--22000

నువ్వులు -- 19000--22000

పల్లిలు...26000--32000

ఆముదం --17000-21000

చెరుకు --65000--82000

మిర్చి ---84000--86000

టమాటా-- 39000--57000

ఉల్లిగడ్డ ---45000-47000

నకిలీ విత్తనాలపై యంత్రాంగం ఫోకస్

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నకిలీ విత్తనాల పట్ల అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. అయితే జిల్లాలో నకిలీ విత్తనాల బెడదను తప్పించేందుకు నిరంతరం అధికారులు తనిఖీలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో ఆయా జిల్లాల కలెక్టర్ సారథ్యంలో పోలీస్, రెవెన్యూ ,వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ మండలాల పరిధిలో కూడా కమిటీలు పనిచేస్తాయి. సీజన్ ముగించే వరకు ఎరువులు , విత్తనాల షాపులను తనిఖీలు చేయడంతో పాటు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తనిఖీలు చేసేందుకు కమిటీలు సిద్ధమవుతున్నాయి. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకోనున్నారు.

వ్యవసాయ అధికారులను సంప్రదించాలి : శ్రవణ్ కుమార్ జేడీఏ, నల్లగొండ

రైతులు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో వ్యవసాయ అధికారులను కచ్చితంగా సంప్రదిస్తే తగిన సలహాలు సూచనలు అందిస్తారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రసీదు తప్పకుండా తీసుకోవాలి. అంతే కాకుండా విత్తనాలు కాల పరిమితి ముగిసిందా లేదా కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. లూజు విత్తనాలు ఎక్కడైనా విక్రయిస్తున్నట్లు రైతులకు సమాచారం ఉంటే వ్యవసాయ శాఖ లేదా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలి.



Next Story

Most Viewed