సహకార సంఘ కార్యవర్గ ఎన్నిక వాయిదా.. కారణమిదే..!

by Sathputhe Rajesh |
సహకార సంఘ కార్యవర్గ ఎన్నిక వాయిదా.. కారణమిదే..!
X

దిశ, చిలుకూరు: మండలంలోని పాలె అన్నారం ఊర చెరువు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యవర్గ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. రాష్ట్ర సహకార సంఘం ఎన్నికల అథారిటీ సూచనల ప్రకారం గురువారం పాలె అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నికలకు నామినేషన్లు తీసుకోవాలి. కాని సభ్యత్వాల విషయంలో ఘర్షణ నెలకొనడంతో మత్స్య శాఖ అధికారి అంజయ్య నామినేషన్లు తీసుకోకుండా వెనుతిరిగారు. నిజానికి గ్రామంలో చెరువు సంఘం విషయమై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. గతంలో ఈ సంఘంలో 239 మంది సభ్యులుగా ఉండేవారు.

వారిలో అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఇటీవల కొందరు పలు కారణాలు చెబుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి సభ్యత్వాలు తగ్గించారు. దీంతో సంఘం రెండు వర్గాలుగా విడిపోయింది. పాత సభ్యత్వాల ప్రకారమే ఎన్నిక నిర్వహించాలని ఒక వర్గం, కొత్త సభ్యత్వాల ప్రకారమే నిర్వహించాలని మరో వర్గం భీష్మించుకు కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ విషయమై 'దిశ' సదరు అధికారిని సంప్రదించగా నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ బందోబస్తుకు చిలుకూరు పోలీసులు వెళ్లారని, దాంతో పోలీస్ రక్షణ లేకుండా నామినేషన్ ప్రక్రియ కష్టమవుతుందని అన్నారు. తిరిగి శుక్ర లేదా శనివారం నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.

మమ్మల్ని సంప్రదించలేదు

నామినేషన్ల విషయమై బందోబస్తు కోసం తమను మత్స్య శాఖ అధికారులు సంప్రదించలేదు. రక్షణ కోరినట్లయితే తప్పనిసరిగా సిబ్బందిని కేటాయించేవాళ్లం.

- సురభి రాంబాబు, ఎస్సై, చిలుకూరు.



Next Story

Most Viewed