దుమ్ముతో ప్రజల ఇబ్బందులు..

by Sumithra |
దుమ్ముతో ప్రజల ఇబ్బందులు..
X

దిశ, చండూరు : మున్సిపల్ కేంద్రంలో చేపట్టిన రెండు వరసల రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మురుగు కాలువల నిర్మాణం కోసం తవ్విన మట్టి రోడ్డుకు ఇరువైపులా పోయటంతో వచ్చిపోయే వాహనాలతో విపరీతమైన దుమ్మువస్తుండటం వ్యాపారస్తులతో పాటుగా ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ముతో అనారోగ్యం బారినపడే అవకాశం ఉన్నందున రోడ్లను శుభ్రం చేసి నిత్యం రోడ్లపై నీళ్లు చల్లాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

నిబంధనల ఉల్లంఘన..

సాధారణంగా జనావాసాల మధ్య ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా గుత్తేదారు చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీలో రోడ్ల పనులు జరుగుతున్నందున దుమ్ము, దూళితో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గుత్తేదారు నీళ్లు చల్లాలి, కానీ ఇక్కడ మాత్రం పనులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఏనాడు రోడ్డు పై నీళ్లు చల్లిన దాఖలాలు లేవని గుత్తేదారు పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు..

దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికి, నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారుడు పనులు చేపడుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో దుమ్ము వచ్చినప్పుడు మున్సిపల్ అధికారులు రోడ్డును శుభ్రం చేసి, నీళ్లు చల్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రజలు ఇప్పుడు ఇంత ఇబ్బందులకు గురైతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండ నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దుమ్మురాకుండా చర్యలు తీసుకోవాలి.

రోడ్డు పనుల వల్ల విపరీతమైన దుమ్ము వస్తుందని చండూరు మున్సిపాలిటీకి చెందిన నాగిళ్ళ నర్సింహా తెలిపారు. ఇండ్లల్లోకి, దుకాణాలల్లోకి దుమ్ము వచ్చిచేరుతుండటంతో ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు స్పందించి రోజు రోడ్లు పై నీళ్లు చల్లించి దుమ్ము రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.



Next Story

Most Viewed