శతాబ్దాల చరిత్ర పెద్దగట్టు.. రెండేళ్లకు ఒకసారి జాతర..

by Sumithra |
శతాబ్దాల చరిత్ర పెద్దగట్టు.. రెండేళ్లకు ఒకసారి జాతర..
X

దిశ నల్లగొండ బ్యూరో, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఆదివారం రాత్రి ప్రారంభం కానుంది. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రానుండటంతో అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు భద్రత పై ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. సీసీ, డ్రోన్ కెమెరాలు వాడనున్నారు. జాతర తొలి ఘట్టం గంపల ప్రదక్షణతో ప్రారంభం కానుంది. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవర పెట్టెను తీసుకొని యాదవ కులస్తులు కాలినడకన బయలు దేరి దురాజ్ పల్లిలో ఉన్న పెద్దగట్టుకు రాత్రి చేరుకుంటారు. గంపతో ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. మెంతబోయిన, గోర్ల, మున్న వంశస్తుల సమక్షంలో రెండు బోనాలు వండి పూజలు నిర్వహిస్తారు. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్ర పట్నం, నాలుగో రోజు నెల వారం, ఆ తర్వాత ఐదో రోజు మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుంది.

శతాబ్దాల చరిత్ర పెద్దగట్టు..

యాదవుల కుల దైవంగా ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఆదివారం రాత్రి ప్రారంభం కానుంది. మేడారం తర్వాత తెలంగాణాలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన గొల్ల గట్టు జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టె (అందనపు చౌడమ్మ పెట్టె) తరలింపు కార్యక్రమం ఆదివారం అర్ధరాత్రి నిర్వహించనున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

స్థలపురాణం ప్రకారం..

రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, అదే కాలక్రమేణా దురాజ్ పల్లిగా మారిందని అంటారు. కాకతీయుల కాలంలో ఉండ్రుగొండ కొండ పై శివకేశవులు ఆలయాలు ఉండేవి. ఇక్కడ ఏటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ ఉత్సవాల్లో మొక్కులు చెల్లించేందుకు గుట్టకు వచ్చిన ఓ గర్భిణి పైకి ఎక్కుతుండగా జారిపడి మరణించిందని, ఈ ఘటనకు చలించిపోయిన స్వామివారు భక్తులకు వీలుగా ఉండేట్లు పాలసేర్లయ్య గుట్ట పై లింగమంతుల స్వామిగా వెలిశారని చెబుతారు.

15 రోజుల ముందు దిష్టి పూజ..

రెండేళ్లకు ఒకసారి జరిగే లింగమంతుల స్వామి జాతర ప్రారంభానికి 15 రోజులు ముందు దిష్టి పూజ మహోత్సవం జరుగుతుంది. మాఘ శుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టి కుంభాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి దేవర పెట్టెను తీసుకురాగా, సూర్యాపేట నుంచి మకర తోరణం ఇతర ఆభరణాలు పెద్ద గట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు. ప్రతి ఆది, సోమవారాల్లో పూజలు జరుగుతుంటాయి. ఆదివారం మొదలు కానున్న ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది.

భక్తులు ఓ లింగా.. ఓ లింగా అని స్మరిస్తూ..

అందనపు చౌడమ్మ తల్లి దేవర పెట్టెలో ఉంటుంది. ఉత్సవాల్లో ఊరేగిస్తుండగా దేవర కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఓ లింగా.. ఓ లింగా అని స్మరిస్తూ దేవర పెట్టెను తాకుతారు. ఇలా తాకడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. చౌడమ్మను సౌడమ్మ తల్లిగా కూడా పిలుస్తారు. యాదవుల కుల దేవత సౌడమ్మ ఆలయాలు సూర్యాపేట, దురాజ్ పల్లి, పెన్ పహాడ్ గ్రామాల్లో తప్ప మరెక్కడా కనిపించక పోవడం విశేషం. జాతరలో భాగంగా పొట్టేలును తీసుకొచ్చి దానికి పూలదండ వేసి పసుపు, కుంకుమ పెట్టి దేవుడు ఉన్న దిక్కు వైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చు కుంటారు. ఓ లింగా.. ఓ లింగా అంటూ భక్తులు హోరెత్తిస్తారు. ఇక మహిళలు తడి బట్టలతోనే పసుపు, కుంకుమ, పూలదండలు, అగరవత్తులతో అలకరించిన మంద గంప నెత్తిన పెట్టుకొని నడుస్తారు. సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. పిల్లలు లేనివారు స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని వారి నమ్మకం. దీనిని పానసారం పట్టడం అంటారు.

పెద్దగట్టుకు చేరుకున్న మకర తోరణం..

ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర మహోత్సవానికి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్ల బజార్ నుంచి స్వామి వారి మకర తోరణం భారీ ఊరేగింపుతో డప్పుల మోతల నడుమ పెద్ద గట్టుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణు రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర.

ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగే పెద్దగట్టు జాతరను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ప్రజలకు భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో జాతరను నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.



Next Story