- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అక్షయ ఇన్ఫ్రా ప్రాపర్టీ పై ఎందుకు అంత ప్రేమ?

దిశ,చౌటుప్పల్ : సామాన్యులు తమ పనుల కోసం రెవెన్యూ కార్యాలయానికి వస్తే ఎలాంటి సమస్యలు లేకున్నా రోజుల తరబడి తిప్పించుకుంటున్నారనే అపవాదు ఉంది. అలాంటిది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నిషేధిత భూముల ఫైల్ ను ఓ మాజీ ఆర్డీఓ అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టి క్లియరెన్స్ ఇవ్వడం ఎవరిపైన ప్రేమతో చేశాడనే అనుమానం కలగక మానదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని వివిధ రెవెన్యూ గ్రామాలలో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూములు కలవు వాటన్నిటిని 2015 సంవత్సరం ముందే నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూములు సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో అప్పటి జిల్లా కలెక్టర్లు ఆ పేరు చెప్తేనే వణికిపోయేవారు. సుమారు 1200 ఎకరాలపై విస్తీర్ణం ఉన్న గోల్డెన్ ఫారెస్ట్ భూములు క్లియర్ చేసేందుకు అసలు ఏ కలెక్టర్ కూడా సాహసించలేదు.
అక్షయ్ ఇన్స్ట్రా ప్రాపర్టీ పైనే ప్రేమ ఎందుకు?
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం రెవెన్యూ పరిధిలోని అక్షయ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ 2015 కు ముందు పది ఎకరాల 36 గుంటల్లో ఓ వెంచర్ ఏర్పాటు చేసింది. ఈ వెంచర్ లింగోజిగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 296,301,307,308,312 లలో ఎ.10.36 గుంటలకు గతంలో నాలా కన్వర్షన్ ఆర్డర్ జారీ చేశారు.అయితే ఈ సర్వే నెంబర్లలో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ కు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. అయితే 2015 సంవత్సరంలో వీటిలోని కొన్ని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కొనుగోలుదారుడు వెళ్ళగా ఆయన తిరస్కరించాడు. ఈ భూములు గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ లోని నిషేధిత జాబితాలో ఉన్నందున ఎలాంటి రిజిస్ట్రేషన్ లను ప్రోత్సహించ వద్దని అప్పటి జిల్లా కలెక్టర్ ద్వారా డిస్టిక్ రిజిస్టర్ అక్షయ్ ఇన్ఫ్రా పేరుతో ప్రత్యేకంగా ఓ ఆర్డర్ ను రిలీజ్ చేశారు.
అంతేకాకుండా భువనగిరి ఆర్డీవో పరిధిలో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ నాలా కన్వర్షన్ వచ్చిన భూముల రిజిస్ట్రేషన్ లో నిలిపివేయాలని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2015 సంవత్సరం నుంచి నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఏ ఒక్క కలెక్టర్ కూడా సాహసించలేదు.కానీ ఇది అంతా తెలిసిన 2021లో చౌటుప్పల్ ఆర్డిఓ గా పనిచేసిన సూరజ్ కుమార్ రిపోర్టు ఆధారంగా అప్పటి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తున్నట్లు చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కు లెటర్ ను పంపించారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, మండల సర్వేయర్లు సదరు భూములలో సర్వే చేసి ఇవి గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ పరిధిలో లేవని నిర్ధారించినట్లు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆర్డర్ కాపీ లో పొందుపరిచారు.
భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు..?
చౌటుప్పల్ మండలం లో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ కు సంబంధించిన సర్వే నెంబర్ లని అన్నింటిని నిషేధిత జాబితాలో చేర్చడం తో సరిహద్దు నిర్ధారణ వివాదంతో చాలామంది పేదలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా సర్వే నెంబర్లు భూములు కొన్న వారికి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయడం తో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు పరుగులు తీసి తమకు క్లియరెన్స్ ఇవ్వాలని వేడుకుంటున్న గోల్డెన్ ఫారెస్ట్ భూములు సుప్రీంకోర్టులో ఉన్నాయని వాటిని మేము పరిష్కరించే వీలులేదని సమాధానం ఇస్తున్నారు. కానీ అక్షయ్ ఇన్ఫ్రా కు సంబంధించిన పది ఎకరాల 36 గుంటలకు క్లియరెన్స్ ఇవ్వడం వెనక భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
అసలు సుప్రీంకోర్టులో కేసు ఉన్న వాటిని క్లియర్ చేసేందుకు అధికారులు ఎందుకు పూనుకున్నారో వాటిపై వాళ్లకు అంత ప్రేమ ఎందుకు అని స్థానికులు చర్చించుకుంటున్నారు. గత కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల కు ప్రస్తుతానికి వచ్చిన మార్పు ఏమిటని, లేదా గతంలో నిషేధిత జాబితాలోకి చేసిన కలెక్టర్ ఉత్తర్వులను ఈ కలెక్టర్ తప్పు పట్టడమే ఉద్దేశమా అనే సందేహం కలగక మానదు. ఇకనైనా గోల్డెన్ ఫారెస్ట్ భూముల క్లియరెన్స్ జరిగిన ఫైళ్లపై సంబంధిత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.