అనుమతులుండవు.. పన్నులు కట్టరు.. ప్రభుత్వ ఆదాయానికి గండి..

by Aamani |
అనుమతులుండవు.. పన్నులు కట్టరు.. ప్రభుత్వ ఆదాయానికి గండి..
X

దిశ,మిర్యాలగూడ టౌన్ : కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా ఇటుకల బట్టీలు నిర్వహణ సాగిస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికారులు కన్నెత్తి చూడటం లేదంటే ముడుపులు భారీగా అందుతున్నాయనడంలో సందేహం లేదు. ఇటుక తయారీ కేంద్రాలు ఊరికి సమీపంలో ఉండటం వల్ల ఇటుకల తయారు కోసం నిల్వ ఉన్న బూడిద, వరిపొట్టు, పొగ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగ పీల్చిన వారికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి, అనుమతి లేకుండా, విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నా పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటు అవుతున్న ఇటుక బట్టీ తయారీని అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అనుమతులు లేకుండా ఇటుకల బట్టీల దందా..

వేములపల్లి మండలం వేములపల్లి ' శెట్టి పాలెం ,అన్నప్ప రెడ్డి గూడెం శివారుల లో కొందరు వ్యాపారులు సాగుభూములను లీజ్ కు తీసుకొని ఇటుకల బట్టీలు నిర్వహణ చేస్తున్నారు.

ఇటుకల బట్టీల నిర్వహణకు గ్రామ పంచాయతీ అనుమతి , నాలా , కాలుష్యం అధికారుల అనుమతి , లేబర్ అధికారుల అనుమతి తీసుకొని ఇటుకల బట్టీల నిర్వహణ సాగించాలి. కానీ ఏళ్ల తరబడి బట్టీల వ్యాపారం చేస్తున్న నిర్వహకులు నిబంధనలు పాటించకుండా ఎలాంటి అనుమతులు లేకుండా యదేచ్చగా వ్యాపారం చేస్తున్నారు.సాగు భూములను నాలా (నాన్ అగ్రికల్చర్) గా మార్చకుండా వ్యాపారం చేస్తున్నారు. అంతేకాకుండా అటు బట్టీల వ్యాపారంతో పాటు వ్యవసాయ భూములుగా చూపుతూ రైతుబంధు నిధులు కూడా కాజేస్తున్నారు.

శెట్టి పాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ముదిరెడ్డి రాంరెడ్డి ప్రతి సీజన్ లో రూ.47 వేలు ,కందుల రవిందర్ రెడ్డి రూ. 19 వేలు ,జంపాల ఝాన్సీరాణి రూ. 21 వేలు జూలిపాల వెంకట్ రెడ్డి రూ. 48 వేలు ,కందుల ప్రభాంజన్ రెడ్డి రూ. 9650 చొప్పున గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు కూడా తీసుకున్నారు. వేములపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 51 లో ఎలాంటి అనుమతులు లేకుండా తంగేళ్ల సుధాకర్ రెడ్డి ,తంగెళ్ల సత్యనారాయణ రెడ్డి లు ఇటుకల బట్టీలు నిర్వహిస్తున్నారు. వీరు కూడా గతంలో బట్టీల నిర్వహణ సాగిస్తూ రైతుబంధు నిధులను తీసుకున్నారు. ఇలా అనుమతులు లేకుండా పన్నులు చెల్లించకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు.

కన్పించని అధికారుల తనిఖీలు..

కోట్ల రూపాయాల లో సాగుతున్న ఇటుకల బట్టీల వ్యాపారం వైపు రెవెన్యూ , విద్యుత్ , కాలుష్యం ,లేబర్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అనుమతులు ,నిబందనల విషయమై అధికారులు కనీసం తనిఖీలు కూడా చేయడం లేదు. దీనివల్ల వ్యాపారులు అంచెలంచలుగా విస్తీర్ణం చేసుకుంటున్నారు. సుమారు 10 సంవత్సరాలుగా అనుమతులు లేకుండానే కొనసాగుతున్న అధికారులు పన్నులు వసూలు కానీ చర్యలు కానీ తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్టీల నిర్వహణలో లోపాలను గుర్తించి చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారుల నుంచి నెలవారీ మాముళ్లు అందజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకవేళ మైనింగ్ , కాలుష్యం అధికారులు తనిఖీలకు వచ్చిన వారికి సరిపడు మర్యాదలు చేసి పంపుతున్నారనే ఆరోపణలున్నాయి.

ప్రధాన రహదారుల పక్కనే బట్టీలు ప్రజల అవస్థలు..

వేములపల్లి మండలంలో నిర్వహించే బట్టీలు నిబంధనలకు విరుద్దంగా ప్రధాన రహదారి పక్కన నిర్వహిస్తున్నారు. దీనివల్ల బట్టీల నుంచి వెలువడే బుడిద, పొగ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట కు ప్రధాన రహదారి కావడం వలన ప్రయాణీకుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. బుడిద కళ్ల లో పడి అనారోగ్యానికి గురైతున్నారు. ఇప్పటికైన కాలుష్యపు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నోటీసులిచ్చిన స్పందన కరువు..

శెట్టి పాలెం శివారులో ఉన్న అక్రమ బట్టీల నిర్వహకులకు నోటీసులు ఇచ్చిన స్పందించడం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పన్నులు చెల్లింపు,అనుమతులు వివరాలు అందజేయాలని పేర్కోంటూ నోటీసులు అందించి నెల రోజులు అవుతున్న వ్యాపారులు లెక్క చేయడం లేదని అధికారులు పేర్కొంటున్నారు .



Next Story