BIG News: డ్యూటీకి ఎక్సైజ్ సిబ్బంది ఎగనామం.. మూడేళ్లుగా జీతం నొక్కేస్తున్న వైనం

by Shiva |   ( Updated:2024-06-14 06:18:54.0  )
BIG News: డ్యూటీకి ఎక్సైజ్ సిబ్బంది ఎగనామం.. మూడేళ్లుగా జీతం నొక్కేస్తున్న వైనం
X

దిశ, నల్లగొండ బ్యూరో: ‘వడ్డించే వాడు మన వాడైతే భోజనం బంతిలో ఏ మూలన కూర్చున్న సరే’.. అంటూ ఓ సామెత ఉంది. ఆ సామెత సరిగ్గా నల్లగొండ ఎక్సైజ్ శాఖ అధికారులకు వర్తిస్తుంది. తనకు నచ్చిన వాళ్లు, ఏది చెబితే అది వినే విధేయులకు ఎక్సైజ్ శాఖలోని ఓ ఉన్నతాధికారి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కారణాలు ఏమైనా ఉండొచ్చు కొంతమంది ఎక్సైజ్ శాఖలో ఉద్యోగానికి రాకపోయినా గత కొన్నేళ్లుగా వేతనం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖలో ముగ్గురు ఉద్యోగులు అనారోగ్యం కారణంగా గత మూడేళ్ల నుంచి విధులకు హాజరు కావడం లేదు.

అందులో ఒకరు మాత్రం వారం రోజులకు ఒకసారి వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తుండడం అనవాయితీగా మారింది. మిగతా ఇద్దరు కార్యాలయానికి రావడం లేదని తెలుస్తోంది. అయితే, మొదట్లో ఆ ముగ్గురు విధులకు హాజరు కావడం లేదని తెలిసి సదరు ఉన్నతాధికారి వాళ్లపై గరం అయ్యేవారట. దీంతో సదరు ఉద్యోగులు ఆ అధికారిని వ్యక్తిగతంగా కలిసి ప్రసన్నం చేసుకున్నారని టాక్. ఇక అప్పటి నుంచి ఆ ముగ్గురికి విధులకు రాకపోయినా.. ప్రతినెలా పూర్తి వేతనం అందుతున్నట్లుగా సమాచారం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ముగ్గురు ఉద్యోగులకు కలిపి నెలకు రూ.80 వేల నుంచి రూ.1 లక్ష వరకు వేతనం వస్తుందని తెలుస్తోంది. వారు విధులకు రాకపోయినా.. వచ్చిన జీతం మొత్తంలో 25 శాతం కమిషన్ తీసుకొని వారు వేతన బిల్లులపై సదరు ఉన్నతాధికారి సంతకాలు చేశారని టాక్ నడుస్తోంది.

అయితే ఈ తంతు గత మూడేళ్లుగా జరుగుతోంది. ఆ లెక్కన ఒక్కొక్క ఉద్యోగి నుంచి గత మూడేళ్లుగా సుమారు రూ.10 లక్షలు కమిషన్ పేరుతో నొక్కేసి‌నట్లుగా ఎక్సైజ్ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కింది స్థాయి అధికారులు ఇలాంటి అవినీతి అక్రమాలకు పాడుతున్నారని తోటి ఉద్యోగులు, జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తతంగం అంతా ఉన్నతాధికారులకు తెలియకుండానే జరుగుతుందా అంటే.. అది పెద్ద పొరపాటే సుమా. ఈ నేపథ్యంలో నిజంగా అనారోగ్యానికి గురైన సిబ్బంది పట్ల మానవత్వం చూపించాలని లేకపోతే విధులకు హాజరయ్యేలా చూడాలి ప్రజలు కోరుతున్నారు. విధులకు గైర్హాజరైన వారికి వేతనం ఆపివేయాలని.. లేకపోతే మగతా ఉద్యోగులకు డ్యూటీ పట్ల ఉన్న గౌరవం పోతుందనే విషయం ఉన్నతాధికారులు గ్రహించాలని పలువురు కోరుతున్నారు.

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం

డిపార్ట్‌మెంట్ పరంగా విచారణ చేపడుతాం. దోషులు ఏ స్థాయిలో ఉన్న వారైనా శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించి ఎవరికి ఏ విషయం తెలిసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి. నిజం రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్



Next Story

Most Viewed