మత్స్య అవతారంలో నరసింహుడు

by Naveena |
మత్స్య అవతారంలో నరసింహుడు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం మూడో రోజు నారసింహుడు మత్స్యావతారంలో కనువిందు చేశారు. ముల్లోకాలను రక్షించే దేవదేవుడి అవతారాల్లో మొట్టమొదటి మత్స్యావతారాన్ని భక్తులు తరించారు. విశ్వశాంతి, లోక కల్యాణం కోసం లక్ష్మీనరసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో అలంకారసేవలు నిర్వహించడం ఆలయ సంప్రదాయం. వివిధ రకాల పుష్పాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకృతులైన స్వామివారి అలంకారసేవ ప్రధానాలయ ఉత్సవ మండపంలో భక్తులకు కనువిందుచేసింది.

అలంకార మూర్తులకు వేద పారాయణాలు, మూల మంత్ర జపాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. రుత్వికులు, అర్చకులు,వేదపండితుల పారాయణాలు,మంగళవాయిద్యాలతో స్వామివారిని ఆలయ తిరువీధులలో ఊరేగించారు. అనంతరం బ్రహ్మోత్సవ మండపంలో అధిష్ఠింపజేసి దుష్టశిక్షణ, శిష్టరక్షణకు, ముల్లోకాలను రక్షించడానికి స్వామివారి మత్స్యావతార విశేషాలను ఆచార్యులు వివరించారు. వేడుకలను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఆధ్వర్యంలో అర్చకబృందం, వేదపండితులు నిర్వహించారు. వైదిక పర్వాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో భాస్కరరావు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed