సాగర్ ప్రాజెక్టు పై సీఆర్పీఎఫ్ పహారా

by Sumithra |
సాగర్ ప్రాజెక్టు పై సీఆర్పీఎఫ్ పహారా
X

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి వాడక విషయంలో ఏపీ వ్యవహరించిన తీరు పై కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయంతో సాగర్ లో నెలకొని ఉన్న ఉద్రిక్తత పరిస్థితులకు చెక్ పడింది. శుక్రవారం రాత్రి సాగర్ కు చేరుకున్న కేంద్ర బలగాలు సాగర్ ప్రాజెక్టును పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. ప్రాజెక్టుకు ఇరువైపులా 144 సెక్షన్ అమలుచేసి బలగాలు ఆయుధాలతో భారీగా మోహరించారు. రెండు బలగాలుగా ఏర్పడిన కేంద్ర బలగాలు అటు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా రైట్ కెనాల్ సమీపంలో ఉన్న రెడ్ బ్యాంక్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నాయి. మరో వైపు సీఆర్‌పీఎఫ్‌ కేంద్ర బలగాలు ప్రాజెక్ట్‌ పై ఫ్లాగ్‌ మార్చ్‌ చేస్తూ తెలంగాణ పైలాన్ పిల్లర్ పార్క్ నుండి ప్రధాన గేటు వద్దకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు వైపుల నుండి 13 గేట్ దగ్గరికి చేరుకున్న కేంద్ర బలగాలు ముల్లకంచను తొలగించాయి. ఏపీ ఇరిగేషన్ అధికారులు, పోలీసులు కలిసి ఓపెన్ చేసిన కుడి కాల్వను మూసి వేయించి నీటి విడుదలను ఆపివేశారు.

గత రెండు రోజులు క్రితం ఏపీ ఇరిగేషన్ అధికారులు, సుమారు 700 మంది పోలీసు బలగాలతో సాగర్ డ్యాం చేరుకుని అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి పోలీస్ సిబ్బంది పై దాడి చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు 13 గేటు వద్ద వరకు తమ ఆధీనంలోకి తీసుకొని రక్షణ కంచ ఏర్పాటు చేశారు. అనంతరం కుడికాలువ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయిన విషయం తెలిసిందే. ఏపీ అధికారులు తెలంగాణ ఆధీనంలో ఉన్న సాగర్ ప్రాజెక్టులోకి చొచ్చుకుని వచ్చి అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నారని తెలంగాణ నీటిపారుల శాఖ కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో డ్యాం పై ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి సిబ్బంది పై దాడి చేసిన ఘటనలో ఏపీ పోలీసులు, అధికారుల పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. దీంతో రంగంలో దిగిన కృష్ణా రివర్ బోర్డు డ్యాం పై నెలకొని ఉన్న వాస్తవ పరిస్థితులను టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి అనంతరం ఏపీ కేఆర్ఎంబీ నిబంధనలను ఉల్లంఘించిందని నిర్ధారించారు. సాగర్ డ్యాం పై నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది.

శనివారం సాయంత్రం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాట్లాడారు. కేంద్ర బలగాలు రెండు రాష్ట్రాలను అధీనంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపాయి. దీంతో అర్ధరాత్రికే సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం పంపింది. సాగర్‌కు ఏపీ వైపు ఏపీ బలగాలు, తెలంగాణ వైపు ఆ రాష్ట్ర పోలీస్‌లు పహారా కాస్తున్నారు. ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, కేఆర్‌ఎంబీ సీఈవోతో శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సాగర్‌ 13వ గేట్‌ నుంచి తమ భూభాగంలోనికి వస్తుందన్న వాదనతో అంగీకరించలేదు. ఈ సందర్భంగా ఏపీపై కేంద్రానికి తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి ఫిర్యాదు చేశారు. ‘‘తెలంగాణ పోలీసు యంత్రాంగమంతా అసెంబ్లీ పోలింగ్‌ విధుల్లో నిమగ్నమై ఉండగా... 29వ తేదీ అర్ధరాత్రి దాదాపు 1000 మంది ఏపీ పోలీసులు నాగార్జున సాగర్‌ను ఆక్రమించారని. భద్రతా దళాలు ఉపయోగించే సీసీ కెమెరాలను, గేట్లను ధ్వంసం చేశారని తెలిపారు. దీనివల్ల హైదరాబాద్‌ నగరానికి మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది’’ అని శాంతి కుమారి తెలిపారు. దీంతో.. సాగర్‌ వద్ద గత నెల 29వ తేదీ నాటికి ముందున్న పరిస్థితులను కొనసాగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి భల్లా ఆదేశించారు.

సాగర్ డ్యాం ను పూర్తిస్థాయిలో సీఆర్పీఎఫ్ పోలీస్ బలగాలతో ఆధీనంలోకి తీసుకు వస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రాజెక్టును కృష్ణా రివర్ బోర్డు పరిధిలోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. నీటి వివాదం పై కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయంతో గత రెండు రోజులుగా నాగార్జునసాగర్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు కేంద్ర బలగాల రాకతో శాంతియుత వాతావరణం నెలకొంది. ప్రాజెక్టు పరిధిలో 144 సెక్షన్ తో ఇరు రాష్ట్రాల పోలీసులు నాగార్జునసాగర్ నుంచి వెను తిరిగి వెళ్లిపోవాలని కేంద్ర బలగాలు కోరాయి.



Next Story

Most Viewed