- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పేదలను మోసం చేస్తున్న వడ్డీ వ్యాపారులు.. రూ. లక్షకు.. రూ.16 వేలు వడ్డీ..

ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా లక్షాధికారులు కావాలనే అత్యాశ కొంతమందిని కోటీశ్వరులను చేస్తుంటే.. మరికొంతమందిని రోడ్డున పడేలా చేస్తోంది. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ డివిజన్లో కొన్నేళ్లుగా ఓ నయాదందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అధిక వడ్డీ పేరుతో పేదల నుంచి రూ.లక్షలు వసూలు చేసి కొత్తతరం మోసానికి వడ్డీ వ్యాపారి తెర లేపినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే వ్యాపారులు పేదల నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా ఎక్కడా ఆధారాలు ఉండవు. అప్పు ఇచ్చిన వారికి ఎటువంటి హామీ పత్రాలు కానీ, ప్రామిసరీ నోట్లు కానీ ఇవ్వడం లేదని సమాచారం. కానీ వ్యాపారులు మాత్రం పేదలకు చెల్లించే వడ్డీ సొమ్ము వివరాలను పటిష్టంగా ఆధారాలతో చెల్లింపు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు మొదలుకుని రూ.10 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. కాగా ఈ దందా గత నాలుగేళ్లుగా కొనసాగుతున్నట్లు వినికిడి. అయితే అప్పుగా తీసుకున్న వ్యాపారి ఆ డబ్బును రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. కాగా, అందులో వచ్చిన డబ్బుతో అప్పులు ఇచ్చిన వారికి వడ్డీలు చెల్లిస్తుండగా అసలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే వ్యాపారి మాత్రం తన పేరు మీద ఎటువంటి ఆస్తులు లేకుండా జాగ్రత్త పడుతూ అన్ని తన బంధువుల పేరు మీద చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వడ్డీ వ్యాపారి పక్కాగా నమ్మిన వాళ్ల గొంతు కోసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా నిఘా వర్గాలు ఈ వడ్డీ వ్యాపారి పై దృష్టి సారించి పేదలకు న్యాయం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లాలో కొన్నేళ్లుగా నయాదందా కొనసాగుతోంది. అధిక వడ్డీ పేరుతో పేదల నుంచి రూ.లక్షలు వసూలు చేసి కొత్తతరం మోసానికి కొంతమంది వడ్డీ వ్యాపారులు తెరలేపారని పెద్ద ఎత్తున జిల్లాలో చర్చ జరుగుతోంది. వ్యాపారులు పేదల నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా ఎక్కడ ఆధారాలు ఉండవు. కానీ వ్యాపారులు మాత్రం పేదలకు చెల్లించే వడ్డీ సొమ్ము వివరాలను పటిష్టంగా ఆధారాలతో చెల్లింపులు చేస్తున్నట్లు సమాచారం.
అధిక వడ్డీ పేరుతో..
దేవరకొండ డివిజన్లోని పీఏపల్లి మండలానికి చెందిన గిరిజన వ్యక్తి అధికంగా వడ్డీ ఇస్తానని చెప్పి పేద వర్గాల నుంచి డబ్బులు అప్పుగా తీసుకుంటున్నారని సమాచారం. రూ.లక్ష అప్పుగా తీసుకుని ప్రతి నెలా రూ.16 వేలు వడ్డీ చెల్లిస్తానని చెబుతూ వందలాది మంది సామాన్యుల వద్ద అప్పుగా తీసుకుంటున్నారని వినికిడి. అలా ఒక్కొక్క వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా అప్పుగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వడ్డీ వ్యాపారి సామాన్యుల దగ్గర డబ్బులు తీసుకునే ముందు ఒక మధ్యవర్తి ద్వారా తీసుకుంటారని, అది కూడా ఎలాంటి లిఖిత పూర్వకంగా పత్రాలు లేకుండా తీసుకుంటారని వినికిడి. కానీ వడ్డీ వ్యాపారి తారె తీసుకున్న అప్పుదారులకు ప్రతినెలా కచ్చితంగా వడ్డీ చెల్లిస్తారని, అవి కూడా పూర్తిగా బ్యాంకు ఖాతా నుంచి చేస్తూ ఉంటారని సమాచారం. ఈ రకమైన దందా దాదాపు నాలుగైదు ఏళ్లుగా జరుగుతుందని గ్రామాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు సుమారుగా 200 మందికి పైగా సామాన్యుల నుంచి సుమారు రూ.50 కోట్ల వరకు సేకరించినట్లు తెలుస్తోంది.
అయితే గ్రామాల్లో సామాన్యుల నుంచి తీసుకున్న అప్పుసొమ్ముతో సదరు వడ్డీ వ్యాపారి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, కన్స్ట్రక్షన్ నిర్మాణంలో కూడా పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. ఇక్కడ వచ్చే లాభాలను అప్పుదారులకు వడ్డీతో పాటు అసలు కూడా చెల్లిస్తారని సామాన్యులతో పేర్కొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అప్పు చెల్లింపులకు దిక్కు లేదు ?
అంటే తాను తీసుకునే డబ్బులకు ఎలాంటి ఆధారాలు ఉండవు. తీసుకున్న డబ్బులకు తిరిగి వడ్డీ చెల్లిస్తున్న క్రమంలో ఆధారాలు చూసుకుని చెల్లింపులు జరుగుతాయని తెలుస్తోంది. అలా తీసుకున్న డబ్బులకు ఇప్పటివరకు కేవలం వడ్డీ మాత్రమే చెల్లించినట్లు సమాచారం. అసలు సొమ్ము మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని సమాచారం. అప్పుగా ఇచ్చిన సామాన్యులు తమ సొమ్మును ఇవ్వాలని పదే పదే అడుగుతున్నప్పటికీ వడ్డీ వ్యాపారి రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని వినికిడి. ఒకవేళ గట్టిగా అడిగినా, పదిమందిలో కూర్చోబెట్టి అడిగినా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాళ్లంతా ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
పక్కా ప్లాన్తో వడ్డీ వ్యాపారి ?
ఒక్క రూపాయి తన సొంత డబ్బులు వాడకుండా లక్షాధికారులను కావాలనే అత్యాశ కొంతమందిని రోడ్డున పడేలా చేస్తోంది. ఆ దిశగానే దేవరకొండ డివిజన్లో పేదల నుంచి డబ్బులు అప్పుగా తీసుకుని వ్యాపారం చేస్తున్న గిరిజన వ్యక్తి తన వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నట్లు తెలుస్తోంది. అధిక వడ్డీకి ప్రజల నుంచి అప్పులు స్వీకరించిన ఆ వ్యక్తి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈ పెట్టుబడులన్నీ తన పేరుతో కాకుండా తన సమీప బంధువుల పేరుతో చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పు ఇచ్చిన వాళ్ల వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడం ఆసరాగా చేసుకుని పేదలు ఇచ్చిన సొమ్ముతో సంపాదించిన ఆస్తులను తన బంధువుల పేరుతో చేస్తున్నారని తెలుస్తోంది.
అంటే వడ్డీ వ్యాపారి పక్కాగా నమ్మిన వాళ్ల గొంతు కోసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికైనా నిఘా వర్గాలు ఈ వడ్డీ వ్యాపారి పై దృష్టి సారించి పేదలకు జరుగుతున్న మోసాన్ని గ్రహించి వారికి న్యాయం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.