సాగర్ నియోజకవర్గ ముఖ చిత్రం మారుస్తాం: కేటీఆర్

by Dishanational2 |
సాగర్ నియోజకవర్గ ముఖ చిత్రం మారుస్తాం: కేటీఆర్
X

దిశ,హాలియ : సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సత్వర అభివృద్ధితో ప్రగతి పథం‌లో దూసుకుకెళ్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గం‌‌లోని హలీయా పట్టణం‌లో హాలియా మున్సిపాలిటీ, నంది కొండ మున్సిపాలిటీ‌లలో రూ. 56 కోట్లలతో చేపట్టిన పనులకు రాష్ట్ర ఐ. టి.పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండింటినీ జోడెద్దుల బండి మాదిరిగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగానే కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఒక్క నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే 825 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. నెల్లికల్ లిఫ్ట్ పనులు 670 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆయకట్టు ప్రాంతానికి నీరు అందిస్తామని ఆయన తెలిపారు.

ఈ జిల్లాలో ఫ్లోరోసిస్‌తో అనేక సంవత్సరాలు ప్రజలు అవస్థలు పడ్డారని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి 46 వేల కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రం మొత్తం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చామని ఆయన తెలిపారు. మంచి మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే 200 ఉన్న పెన్షన్ 2000 వరకూ పెంచి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదింటి ఆడపిల్లల కోసం పెళ్లి కోసం కులం, మతం‌తో సంబంధం లేకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సహాయము అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. గర్భిణీ స్త్రీలు ప్రస్తావించగానే మగ అయితే 12000, ఆడపిల్ల అయితే 13000లు అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని ఆయన తెలిపారు.

973 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి బట్టలు, బ్యాగులు, పుస్తకాలు, షూ లు, అన్ని సౌకర్యాలతో సన్న బియ్యం తో భోజన సదుపాయాలు కల్పించామని తెలిపారు. 1000 పైగా రెసిడేన్షియల్ విద్య సంస్థలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యానందిస్తున్నామన్నారు. 16 వేల కోట్లతో ఫీజు రియంబర్స్ మెంట్‌ను డాక్టర్, ఇంజనీరింగ్, ఉన్నత చదువుల కోసం చెల్లించామని ఆయన తెలిపారు. తెలంగాణలో రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. రైతు ప్రేమికులు, రైతు బిడ్డల కోసం పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు 10 వేల రూపాయలను రైతు బంధు ద్వారా చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భీమా కల్పించామని, సాగర్ నియోజకవర్గ పరిధిలో 40 తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించామని, అలాగే నందికొండ, హాలియా‌లను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

నందికొండ, హాలియా మునిసిపాలిటీలలో ఒక్కొక్క మున్సిపాల్టీకి 28 కోట్ల చొప్పున మొత్తం 56 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపనలు చేసుకున్నాం అన్నారు. అందులో భాగంగా నందికొండ‌లో 8 కోట్ల‌తో బీటీ రోడ్లు, డిజిటల్ లైబ్రరీ, బస్టాండ్, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, ఆడిటోరియం, డ్రైనేజి పనులు, వెజ్, నాన్-వెజ్ మార్కెట్, వైకుంఠ ధామం, హాలియాలో రోడ్ల విస్తరణ, ట్యాంక్ బండ్, అప్రోచ్ రోడ్, వాకింగ్ ట్రాక్, డ్రైనేజి, సీసీ రోడ్లు ఉన్నట్లు ఆయన వివరించారు.

స్థానిక నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ నియోజకవర్గంలో ఇంకా కొన్ని అభివృద్ధి పనులకు మంజూరు చేయాల్సిందిగా సభా వేదిక ద్వారా మంత్రులకు విజ్ఞప్తి చేశారు. అట్టి విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ తన శాఖ ద్వారా హాలియా పట్టణంలో డ్రైనేజీ పనులకోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక రాష్ట్రాల క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో చర్చించి హాలియా పట్టణంలో స్టేడియం కోసం 3 కోట్ల 75 లక్షల రూపాయలను తక్షణమే మంజూరు చేసినట్లు ప్రకటించారు.

ఈ సభలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు MLC, పల్లా రాజేశ్వర్ రెడ్డి,మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, MLA లు రవీంద్ర నాయక్, గాదరి కిషోర్, భాస్కర్ రావు, MLC కోటి రెడ్డి, ప్రజాప్రతినిధులు,పాల్గొన్నారు.


Next Story

Most Viewed