- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డబుల్ ధమాకాతో భారీ మోసం

దిశ, చింతపల్లి : ధమాకా డబ్బుల స్కీంతో ఏకంగా రూ.50 కోట్లు కొల్లగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..చింతపల్లి మండలం మాల్ (గోడుకొండ్ల ) వద్ద మదిని సంజయ్ రెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి గత నాలుగేళ్ల క్రితం మనీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడర్స్ పేరుతో ఆఫీస్ తెరిచాడు. వంద పెట్టుబడితో 2వందలు, వెయ్యి పెడితే 2 వేలు, పదివేలు పెడితే ఇరవై వేలు, లక్షతో రెండు లక్షలు అంటూ డబుల్ ధమాకా ఆశ చూపించాడు.
మొదట్లో కొందరికి చెప్పినట్లుగానే ఇచ్చి నమ్మించాడు. ఏకంగా గ్రామానికి చెందిన 10మంది ఏజెంట్లను పెట్టుకొని వారికి నెలకు రూ.16 వేల జీతం ఇస్తూ టార్గెట్ పెట్టుకుని మండలంతో పాటు మర్రిగూడ, నాంపల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం, కరీంనగర్, నిజామాబాద్, చౌటుప్పల్, హైద్రాబాద్ వరకు విస్తరించాడు. దీంతో మనీష్ రెడ్డి మనీ ట్రాపులోకి సామాన్యులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరిపోయారు. ఆశ అన్ని మరిచేలా చేస్తుంది.వేలు లక్షలు పెట్టుబడి పెట్టారు. మొత్తం 200 మంది దగ్గర సుమారు రూ.50 కోట్లు కొల్లగొట్టి కొంతకాలం కొందరికి ఇంటికి, వాహనాలకు లోన్లు ఇస్తానని నమ్మించాడు. ఆ తరువాత ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీసిన మనీష్ రెడ్డి..
గత 7 నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో అప్రమత్తమైన బాధితులు ఒత్తిడి పెంచారు. ఇక చేసేదేమి లేక అతనే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తనపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని గ్రామస్తుల వేధింపులు భరించలేక పోతున్నానంటూ చిత్రంగా తనపై తానే ఫిర్యాదు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరకుని వడ్డీ ఇవ్వకున్నా పర్వాలేదు అసలైన ఇవ్వమని అడుగగా, నాదగ్గర రూపాయి కూడా లేదు జైల్లో పెట్టుకుంటారా, చంపేస్తారా చంపేయండి అంటూ మొండికేయడం తో గ్రామస్తులు చేసేదేమీ లేక, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వద్దు పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని గ్రామానికి తీసుకొచ్చారు.
గ్రామ పెద్దల సమక్షంలో డబ్బులు ఎప్పుడు ఇస్తావని 200మంది ఇంటికి వెళ్లి నిలదీయగా, నిందితుడు మనీష్ రెడ్డి 100 కు కాల్ చేశారు. పోలీసులు వచ్చి వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తానని చెప్పేవారితో జాగ్రత్తగా ఉండాలని ఇలా ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
ఈ కేసులో కొసమెరుపు ఏమిటంటే కొందరు లక్ష నుండి 10 లక్షలు పెట్టుబడి పెడితే, ఒక ప్రైవేటు బ్యాంకు మేనేజర్ తో సహా ఓ ప్రభుత్వ బ్యాంక్ క్యాషియర్ 60 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ సమస్యపై ప్రజలు పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ గిరిబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని 50 కోట్లు కాదు గాని సుమారు 5 నుంచి 8 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆయన వెంట నాంపల్లి సీఐ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.