మత్స్యావతారంలో నరసింహుడు.. యాదగిరిక్షేత్రంలో బ్రహ్మోత్సవ అలంకార వైభవం

by Aamani |
మత్స్యావతారంలో నరసింహుడు.. యాదగిరిక్షేత్రంలో బ్రహ్మోత్సవ అలంకార  వైభవం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం మూడో రోజు నారసింహుడు మత్స్యావతారంలో కనువిందు చేశారు. ముల్లోకాలను రక్షించే దేవదేవుడి అవతారాల్లో మొట్టమొదటి మత్స్యావతారాన్ని భక్తులు తరించారు. విశ్వశాంతి, లోక కల్యాణం కోసం లక్ష్మీనరసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో అలంకారసేవలు నిర్వహించడం ఆలయ సంప్రదాయం. వివిధ రకాల పుష్పాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో దివ్య మనోహరంగా అలంకృతులైన స్వామివారి అలంకార సేవ ప్రధానాలయ ఉత్సవ మండపంలో భక్తులకు కనువిందు చేసింది. అలంకార మూర్తులకు వేద పారాయణాలు, మూల మంత్ర జపాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

రుత్వికులు, అర్చకులు, వేదపండితుల పారాయణాలు, మంగళవాయిద్యాలతో స్వామివారిని ఆలయ తిరువీధులలో ఊరేగించారు. అనంతరం బ్రహ్మోత్సవ మండపంలో అధిష్ఠింపజేసి దుష్టశిక్షణ, శిష్టరక్షణకు, ముల్లోకాలను రక్షించడానికి స్వామివారి మత్స్యావతార విశేషాలను ఆచార్యులు వివరించారు. రాత్రి శేషవాహనంపై దివ్యమనోహరంగా అలంకరించిన పూజారులు బాలాలయ మండపంలో విహరింప జేశారు.లక్ష్మీ సమేత నరసింహుడు ఆదిశేషుడి పడగనీడలో శయనించగా భక్తజనులు దర్శించుకుని తరించారు. వేడుకలను పాంచరాత్రాగమశాస్త్రరీతిలో ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఆధ్వర్యంలో అర్చకబృందం, వేదపండితులు నిర్వహించారు. వైదిక పర్వాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో భాస్కరరావు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

గరికపాటి ప్రవచనాలు..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా సహస్రావధాని, ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు ప్రవచనాలు కొనసాగుతున్నాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో గరికపాటి ప్రవచనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రవచనాలలో యాదగిరిగుట్ట ప్రజలతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గరికపాటి ప్రవచనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్వామివారికి పట్టు వస్త్రాల అందజేత...

యాదగిరిగుట్ట శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవా సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వాహణాధికారి వెంకయ్య చౌదరి ఈ వస్త్రాలను యాదగిరిగుట్ట ఈవో భాస్కరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా వారికి యాదగిరిగుట్ట స్వామి వారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని బహుకరించారు.



Next Story

Most Viewed