బ్రహ్మోత్సవాల్లో వటపత్రశాయిగా లక్ష్మీనరసింహ స్వామి..

by Sumithra |
బ్రహ్మోత్సవాల్లో వటపత్రశాయిగా లక్ష్మీనరసింహ స్వామి..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి అలంకార సేవోత్సవంలో భాగంగా నాలుగో రోజైన మంగళవారం నృసింహస్వామి ఉదయం వటపత్రశాయి అలంకార సేవలో, ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగారు. ప్రధానాలయంలో వేకువజామున ద్వారతోరణ పూజ, ధ్వజకుంభారాధన, అగ్నిఆరాధన, మూలమంత్ర, పంచసూక్త హవనం వంటి పూజలు చేపట్టారు. స్వామివారిని వటపత్రశాయి అలంకారంలో ప్రత్యేక పల్లకి పై అధిష్ఠించి ప్రధానాలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. సృష్టి ఆదిలో మహావిష్ణువు ధరించిన అద్భుత రూపమే వటపత్రశాయి అలంకారమని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు వివరించారు.

''కరార విందేన పదార విందం

ముఖారవిందేన విని వేశ యంతు

వటస్య పత్రస్య పుటేశయానం

బాలం ముకుందం మనసా స్మరామి,''

అని మహాభాగవతంలో వటపత్రశాయి గురించి విశిష్టంగా చెప్పారు. పూర్వం ప్రళయాంత కాలంలో స్వామి సృష్టిని తిరుగోమనం చేయడం కోసం సంకల్పించినప్పుడు స్వామి 14 లోకాలను చిన్న నిష్కమాత్ర ప్రమాణం ద్వారా గర్భంలో నిక్షిప్తం చేసుకుని మర్రి ఆకు పై పవళించినటువంటి దృశ్యమే వటపత్రశాయి రూపం అని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఇది కేవలం ఒక మార్కండేయ మహర్షి మాత్రమే దర్శించారు. అలాంటి అపురూప దర్శనం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం సాక్షాత్కారమైంది.



Next Story

Most Viewed