చల్లంగా చూడు తల్లి సమ్మక్క.... మొక్కులు తీర్చుకున్న భక్తులు

by Naresh |
చల్లంగా చూడు తల్లి సమ్మక్క.... మొక్కులు తీర్చుకున్న భక్తులు
X

దిశ, రాజపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని చిన్న మేడారం, యాదాద్రి మేడారం చల్లూరు, లక్ష్మక్క పల్లి గ్రామాలలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి. సల్లంగా చూడు తల్లి సమ్మక్క అంటూ భక్తులు కొబ్బరికాయలు కొట్టడం, ఒడిబియ్యం సమర్పణ, తలనీలాలు ఇవ్వడం, బోనాలు సమర్పించడం, నిలువెత్తు బంగారం అందించడం, కోళ్లు గొర్రెలు మొక్కులు చెల్లించడం, పసుపు కుంకుమ అందించడం, అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించడం, నగదు రూపేనా హుండీలో మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు రాజపేట మండలం జాతర్లకు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు.

మొదటిసారి ప్రారంభమైన చల్లూరు యాదాద్రి మేడారం జాతరకు సుమారు 50 వేల మంది భక్తులు హాజరు కావడం విశేషం. జాతర నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుత్, మంచినీరు, మజ్జిగ, వైద్య శిబిరాలు పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు జాతర సందర్శించగా వారికి నిర్వాహకులు స్వాగతం పలికి సత్కరించారు. జాతర వద్ద అనేక గుడారాలు వెలిశాయి. కుంకుమ భరణి ల రూపంలో గద్దలపై నెలకొన్న సమ్మక్క సారలమ్మ తల్లులను తనివి తీర దర్శించుకున్న భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కోయ బిడ్డలు, దయగల తల్లులు అయిన జగమేలే సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం పుట్ట పగిలి చీమలు వచ్చినట్లుగా, అన్ని దారుల నుంచి భక్తజన సందోహం జాతర ప్రాంగణాలకు చేరుకున్నారు. కల్లు శానాలు, శివసత్తుల శిగాలు, చిందులేసే యువకులు డప్పు వాయిద్యాలు మైకుల ద్వారా పాటలు "జై సమ్మక్క, జై సారలమ్మ"తో అమ్మవార్లను కొలుస్తూ జాతర సాగింది. పోలీసులు సంబంధిత అధికారులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు. శనివారం అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.



Next Story

Most Viewed