మద్దతు ధర చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు : అదనపు కలెక్టర్ శ్రీనివాస్

by Aamani |   ( Updated:2024-11-11 07:54:48.0  )
మద్దతు ధర చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు : అదనపు కలెక్టర్ శ్రీనివాస్
X

దిశ, మిర్యాలగూడ : ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ రేటుకు ధాన్యం కొనుగోలు చేసిన మిల్లులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములపల్లి మండలం శెట్టి పాలెం సమీపంలోని మహర్షి మిల్లులో రైతుల ఫిర్యాదు మేరకు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. మిల్లులో ఉన్న రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు వివరాలను తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలిగే విధంగా మిల్లర్లు వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చిoట్లకు క్వింటాల్ కు రూ. 2400 ప్రజలకు రూ. 2320 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే మిల్లు సీజ్ చేయడంతో పాటు ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

అందుకు అనుగుణంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయడానికి 340 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, అందులో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడానికి 82 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రికార్డులు పరిశీలించిన అనంతరం రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం తో మిల్లు యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం లోగా రైస్ మిల్లు కొనుగోలు, రైతులకు చెల్లింపు వివరాలను అందించాలని సివిల్ సప్లై అధికారులకు సూచించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిల్లు పై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రైతులు సమన్వయం పాటించాలని కోరారు. ఆయన వెంట సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, సీఐ వీరబాబు, ఎస్సై వెంకటేశ్వర్లు, అధికారులు వాజిద్, కోటేశ్వరి, రుసేంద్రమని, సైదానాయక్ తదితరులున్నారు.

ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు : సబ్ కలెక్టర్ నారాయణ అమిత్

మిర్యాలగూడ సమీపంలోని అన్ని రైస్ మిల్లుల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. మహర్షి రైస్ మిల్లులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహర్షి మిల్లు యాజమాన్యం క్వింటాల్ కు రూ.2150 కూడా కొనుగోలు చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే మిల్లుల పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి ఆదేశాలున్నట్లు పేర్కొన్నారు. అన్ని రైస్ మిల్లుల యాజమాన్యం సహకరించాలని కోరారు.



Next Story

Most Viewed