50 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నారు : కంచర్ల రామకృష్ణ రెడ్డి

by Sumithra |
50 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నారు : కంచర్ల రామకృష్ణ రెడ్డి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఎమ్మెల్యేకు 50 కోట్ల రూపాయలు ఇచ్చి బతిమిలాడి కొనుగోలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బుధవారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ రైతు రుణమాఫీ రైతుబంధు విషయం అభిప్రాయ సేకరణ పేరుతో నాటకాలు ఆడుతుందని, సాగుచేసిన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో తెలంగాణను అభివృద్ధిని చేస్తూ, చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఎన్నికలలో ఓడిపోయామని, ఎన్నికలలో గెలుపోవటములు సహజమని అన్నారు. కాగా గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని పొరపాటు చేశామని, అందుకే ప్రజలు జీర్ణించుకోలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా తాము చేసిన పొరపాటును పునరావృతం చేస్తుందని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయక సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారని, ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత ఎదురవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకపోతే ప్రజాక్షేత్రంలో మోసపూరిత విధానాల పై ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించి, ప్రజా పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా ఎమ్మెల్యేలకు ఒక వరంలా మారిందని ఆరోపించారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో యాదాద్రి ఫ్లవర్ ప్లాంట్ కు ఒక రోజుకు 50 లారీల చొప్పునని పర్మిషన్ తీసుకొని, మిగతా 300 లారీలను హైదరాబాద్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జడల అమరేందర్ గౌడ్, కొలుపుల అమరేందర్, సుదగాని హరి శంకర్, కల్లూరి రామచంద్ర రెడ్డి, కంచి మల్లయ్య, ఎనబోయిన ఆంజనేయులు, ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, పటికం లక్ష్మీనారాయణ, ఇట్టబోయిన గోపాల్, తాడెం రాజశేఖర్, తాడూరి బిక్షపతిలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed