కోటి రూపాయలు వృధా ఖర్చేనా..?

by Naveena |
కోటి రూపాయలు వృధా ఖర్చేనా..?
X

దిశ,సంస్థాన్ నారాయణపురం : గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామంలో 64 డబుల్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. అదేవిధంగా మండల కేంద్రంలో 120 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి పనులు కూడా ప్రారంభించారు. కానీ ఈ డబుల్ ఇండ్లు ప్రారంభమైన నాటి నుంచి పనులు నత్తనడకన సాగి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సంవత్సరాలు గడుస్తున్న డబుల్ ఇండ్ల పనులు నేటికీ పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి.

కోటి రూపాయలు వృధా ఖర్చేనా?

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 120 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. ఇక్కడ డబుల్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్ ప్రారంభ దశ నుండి బిల్లులు సమయానికి రావడంలేదనే కారణంతో..తీవ్ర జాప్యం చేసుకుంటూ వచ్చాడు. ఎలాగో అలా ఈ 120 ఇండ్లకు బేస్మెంట్ పూర్తయి పిల్లర్లు నిర్మించేందుకు స్టీల్ ను ఏర్పాటు చేశారు. తదనంతరం ఇప్పటివరకు చేసిన బిల్లులు రావడం లేదంటూ కాంట్రాక్టర్ పనులను నిలిపివేయడంతో.. అక్కడే పనులు ఆగిపోయాయి. తాజాగా పూర్తి చేసిన పనులన్నింటికీ సదరు కాంట్రాక్టర్ కు సుమారు కోటి రూపాయల వరకు బిల్లులు కూడా వచ్చాయి. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలను టెండర్లకు ఆహ్వానించింది. అయితే ఇక్కడ నిర్మించబోయే 120 ఇండ్లకు సుమారు 6 కోట్లకు పైగా ఖర్చు వస్తుంది. ఇప్పటికే కోటి రూపాయలు చెల్లించిన ప్రభుత్వం మరో ఐదు కోట్లు విడుదల చేసి నిర్మాణాన్ని పూర్తి చేయిస్తే..120 కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించవచ్చు. కానీ ప్రస్తుత కాంట్రాక్టర్ గత ప్రభుత్వంలో ఇచ్చిన యూనిట్ ధర సరిపోడం లేదంటూ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ ఇండ్లను అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే సర్వే బాధ్యతలను స్థానిక పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ..ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాపాలనలో డబుల్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి..బుధవారం నుంచి సర్వేను కూడా ప్రారంభించారు. అయితే మరో ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 120 కుటుంబాలకు మండలంలో డబుల్ ఇండ్లను అందించే అవకాశం ఉన్నందున స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కాంట్రాక్టర్ చేత మిగిలిన పనులను పూర్తి చేయించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన స్టీల్ తుప్పు పట్టి ప్రభుత్వ పెట్టిన ఖర్చు వృధా అయ్యే అవకాశం ఉందని వాపోతున్నారు.

కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చాం: సురేందర్ ఆర్ అండ్ బి డిఈ

డబుల్ ఇండ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ కు గత వారం రోజుల కింద నోటీసులు జారీ చేశామని సురేందర్ ఆర్ అండ్ బిడిఈ అన్నారు . 15 రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే సదరు కాంట్రాక్టర్ ను తొలగిస్తామన్నారు. అంతేకాకుండా టెండర్ సమయంలో కాంట్రాక్టర్ ఇచ్చిన బ్యాంకు గ్యారంటీని జప్తు చేస్తామని ఆర్ అండ్ బిడిఈ అన్నారు.



Next Story

Most Viewed