దళారులదే పెత్తనం.. రైతు బజార్‌లో అడ్డగోలుగా అక్రమాలు

by Sumithra |
దళారులదే పెత్తనం.. రైతు బజార్‌లో అడ్డగోలుగా అక్రమాలు
X

వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలను అందించేందుకు గతంలో ప్రభుత్వాలు రైతు బజార్లను ఏర్పాటు చేశాయి. కానీ ఆ రైతు బజార్లలో ప్రస్తుతం రైతులు లేకపోగా దళారులదే రాజ్యం నడుస్తోంది. వినియోగదారులు మోసపోకుండా, పండించిన కూరగాయలను మద్దతు ధరకే విక్రయించే సదుద్దేశంతో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లలో దళారులే వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు రోజువారీగా మామూళ్లు వసూళ్లు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు, దళారులు కలిసికట్టుగా అధిక ధరలకు కూరగాయలను విక్రయించి వినియోగదారులను మోసం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రైతులు స్వయంగా కూరగాయలు పండించి మార్కెట్‌కు తీసుకొస్తే దళారులు చెప్పిన రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు వాపోతున్నారు. అంతేకాక ప్లాస్టిక్ నియంత్రణ తగ్గించి పారిశుధ్యం మెరుగుపరచడమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పలుమార్లు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. మార్కెట్లలో భారీగా ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, మిర్యాలగూడ : వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలను అందించడంతో పాటు దళారుల చేత మోసపోకుండా పండించిన కూరగాయలను మద్దతు ధర లభించే విధంగా అమ్ముకోవడం కోసం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వం సదుద్దేశంతో ఏర్పాటు చేసిన రైతు బజార్లలో రైతులు లేకుండా దళారులతోనే వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు రోజువారి మామూలు తీసుకుని వారికి అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు, దళారులు కలిసికట్టుగా ఏర్పడి అధిక ధరలకు కూరగాయలను విక్రయించి వినియోగదారులను మోసం చేస్తున్నారు.

దళారులదే పెత్తనం..

మిర్యాలగూడ పట్టణంలోని రైతు బజార్‌లో దళారుల పెత్తనం కొనసాగుతుంది. అందుకు దళారులకు అధికారులు మద్దతు తెలుపుతూ వ్యాపారాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. స్వయంగా పండించిన రైతులు కూరగాయలు మార్కెట్‌కు తీసుకువస్తే దళారులు చెప్పిన రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. దీంతో పాటు పంట పండించే రైతులను రైతు బజారులో విక్రయించకుండా షరతులు పెట్టి అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధిక రేట్లకు విక్రయాలు..

మార్కెట్‌లో ఏర్పాటు చేసిన రేట్ల పట్టికలో ఉన్న ధర కంటే అధిక రేటుకు కూరగాయలను విక్రయిస్తున్నారు. ఉదాహరణకు కేజీ బెండకాయలు రూ.60 పట్టికలో రేటు ప్రకటించగా విక్రయించే వారు మాత్రం కేజీ రూ.80 చొప్పున అమ్ముతున్నారు. వినియోగదారులు నిలదీస్తే కేజీ కొనుగోలు చేస్తే రూ.60కు ఇస్తామని పావు కేజీ రూ.20 తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీగా ఒక్కొక్క షాపునకు రూ.100 నుంచి రూ.150లను అధికారులు వసూలు చేస్తున్నట్లు బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తగ్గని ప్లాస్టిక్ నియంత్రణ..

ప్లాస్టిక్ నియంత్రణ తగ్గించి పారిశుధ్యం మెరుగుపరచడమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పలుమార్లు అధికారులు, మార్కెట్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి స్వచ్ఛ మిర్యాలగూడ పేరుతో కాలుష్యం పట్ల అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ నియంత్రణ తగ్గించాలని కోరారు. కానీ మార్కెట్లలో భారీగా ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రైతు బజార్‌తో పాటు పక్కనే ఉన్న చేపల మార్కెట్లో ప్లాస్టిక్ కవర్ల విక్రయం ఒక వ్యాపారంగా మారింది. అధికారులు ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ లోని అక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed