వనదేవతల పేరుతో.. జనం సొమ్ము దోపిడీ..!

by Mahesh |
వనదేవతల పేరుతో.. జనం సొమ్ము దోపిడీ..!
X

దిశ, ఆలేరు: తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన వనదేవతలైన "శ్రీ సమ్మక్క సారక్క" పేర్ల మీద SNSA డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసి అమాయక ప్రజలను దగా చేస్తూ జనం సొమ్మును దోపిడి చేస్తూ.. కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఏ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన హైదరాబాద్ జంట నగరాలను మినహాయించి మరెక్కడ వెంచర్లు ఏర్పాటు చేసిన ప్రముఖ ప్రఖ్యాతి ప్రసిద్ధిగాంచిన దేవాలయాల, పుణ్యక్షేత్రాలను తమ తమ సంస్థల బ్రోచర్లలో ముద్రించి , దేవుళ్ళ పేరు మీద రియల్ ఎస్టేట్ వెంచర్ల నామకరణం చేసి అధికారిక, అనాధికారికంగా జనాలకు ప్లాట్లు విక్రయించి డబ్బు సంపాదించేవారిని ఇప్పటివరకు చూశాం.

కానీ SNSA డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మాత్రం ప్రజలకు దేవుళ్లపై ఉన్న సెంటిమెంట్ అసరగా చేసికొని వనదేవత లేనటువంటి "శ్రీ సమ్మక్క సారక్క" గద్దెలను ఏర్పాటు చేసి మరి ఆ దేవతల పేరుతోనే వెంచర్‌కు నామకరణం చేసి ఈ దేవతల జాతర పేరుతో జనాన్ని దగా చేస్తూ కోట్లాది రూపాయల కొలగొట్టడం వీరికే చెల్లింది. ఈ సంస్థ వనదేవతల పేరుతో ఇప్పటివరకు అధికారిక, అనధికారికంగా 17 వెంచర్లను ఏర్పాటు చేసి జనానికి కట్ట బెట్టినట్లు దిశ పరిశీలనలో తెలిసింది.

వనదేవతల గద్దెలు ఏర్పాటు!!

ఆలేరు మండలం కొలనుపాక రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్లు 997,998,1005,1006,1007,1007,1008,1009,1010,1011, లలో ఆలేరు టు సిద్దిపేట రోడ్డులో SNSA డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెంచర్ నెలకొల్పింది. ఏకంగా వనదేవతలైన "శ్రీ సమ్మక్క సారక్క" గద్దెలను ఏర్పాటు చేసి రాత్రి సమయంలో కళ్లు మిరిమిట్లు గొలిపే లైటింగ్ ఏర్పాటు చేసి సోషల్ మీడియా, వెబ్ సైట్‌లో విస్తృత ప్రచారం చేస్తూ శ్రీ సమ్మక్క సారక్క పేరుతో పాటు శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం, జైన మందిరం, కొమురవెల్లి మల్లన్న దేవాలయాలతో ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం మినీ విమానాశ్రయం ఏర్పాటుకై ప్రతిపాదన చేసిందని జనాలను బూరుడి కొట్టిస్తు ప్లాట్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆలేరు మండలం కొలనుపాక తో పాటు, రాజపేట మండలం దూది వెంకటాపురం గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్లు 161,162,163,164,165, లలో ఫామ్ ల్యాండ్ వెంచర్ల ను ఏర్పాటు చేసి బంగారం ఫిక్స్ డిపాజిట్లు, షేర్లకంటే మా సంస్థలో పెట్టుబడి.. లాభదాయకమైన పెట్టుబడి అని ప్రజలను మోసం చేస్తూ ఫామ్ ల్యాండ్ పేరుతో విచ్చలవిడిగా గజానికి 4500 చొప్పున జోరుగా విక్రయాలు జరుపుతున్నారు.

6 నెలలకు ₹50 వేల ఆదాయం పేరుతో..

కొనుగోలు చేసిన ఒక్కొక్క గుంట భూమిలోని ఉద్యనవ పండ్ల చెట్ల ద్వారా ప్రతి ఆరు నెలలకు ₹50 వేల చొప్పున ఆదాయం వస్తుందని, అదేవిధంగా ఐదు సంవత్సరాలలో పెట్టుబడి రెట్టింపు అవుతుందని ప్రజలను నమ్మిస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకున్నప్పటికీ అక్రమంగా విక్రయాలు జరుపుతు సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా కొనుగోలుదారులకు సులభ వాయిదా పద్ధతి ద్వారా కూడా ప్లాట్లు కొనుగోలు చేసుకోవచ్చని వారికి ఎర వేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫామ్ ల్యాండ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలు జనం సొమ్ము కొల్లగొడుతున్నారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వానికి గండి కొట్టడమే కాకుండా సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వలలో చిక్కి సమిధలవుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, డీటీసీపీ, స్థానిక సంస్థల అధికారులు పట్టించుకోని ప్రజలు నష్టపోకుండా చూడాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed