అక్రమ వెంచర్లు..అడ్డగోలు అమ్మకాలు

by Aamani |
అక్రమ వెంచర్లు..అడ్డగోలు అమ్మకాలు
X

దిశ,నల్లగొండ బ్యూరో : కొత్తగా మండలం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది.ప్రభుత్వ భవన నిర్మాణాలకు మండలం లో ప్రభుత్వ భూములు లేవని సాకుతో ఇప్పటికే మంజూరైనా నిర్మించడం లేదు.కానీ ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్న వారి పై మండల అధికారులలో నిఘా కరువైందని చర్చ సాగుతోంది. డీటీసీపీ నుంచి లే అవుట్ పర్మిషన్లు తీసుకోకుండానే పలు అక్రమ వెంచర్లు వెలిసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం..

తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలోని సర్వే నెంబర్లు 397,403,499,771 లోని ప్రభుత్వ,అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సర్వే నెంబర్లలో అక్కడక్కడ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం మైనట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వ్యవసాయ వ్యవసాయేతర భూములలో కొత్తగా వెంచర్లు ఏర్పాటు చేయాలంటే గ్రామపంచాయతీ నుండి నాలా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.కాని గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోకుండానే ఇష్టానుసారంగా వెంచర్లు ఏర్పాటు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నట్టు ప్రజల మధ్య చర్చ సాగుతోంది.అక్రమ సంపాదనకు అలవాటు పడిన అక్రమార్కులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.ప్రభుత్వ నిబంధనలు పాటించకుండానే ఇప్పటికే మండలంలో పలు వెంచర్ లో ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. వ్యవసాయ భూములను గుంటల మాదిరిగా మార్చి అమ్మకాలు చేపట్టి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అటువంటి భూములకు రైతు భరోసా నిధులు కూడా జమ అవుతుండడంతో కొనుగోలుదారులు కూడా వాటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండానే ప్లాట్లు ఏర్పాటు..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ నుంచి నాలా పర్మిషన్ తీసుకొని వెంచర్ ఏర్పాటు చేయాలి.కానీ అటువంటి నిబంధనలు మండలం లో ఎక్కడ పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొత్తగా వెంచర్ ఏర్పాటు చేయాలంటే డీటీసీపీ అనుమతి పొందాలి.ఆ వెంచర్ లో గ్రామ పంచాయతీకి 10 శాతం భూమిని కేటాయించాల్సి ఉంటుంది.పర్మిషన్ తీసుకోకపోవడంతో అప్పనంగా అక్రమార్కులు ఆ భూమిని మింగేస్తున్నారు.ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి లక్షలు గడిస్తున్నారు.ప్రభుత్వ,అసైన్డ్ భూములలో ప్లాట్లు ఏర్పాటు చేసి అమాయకులకు వాటిని అమ్మి లక్షలలో వెనకేసుకుంటున్నారు. ఇటువంటి వెంచర్ల పై అధికారులు చూసి చూడని ధోరణి అవలంబిస్తున్నారని చర్చ సాగుతోంది.

పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా ప్రభుత్వ భూముల సర్వే..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి తిరుమలగిరి (సాగర్) మండలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.దీంతో ఆనాటి కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రభుత్వ భూములను అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములలో కబ్జాలో ఉన్న రైతుల వివరాలను కలెక్టరేట్ కార్యాలయానికి అందించారు. మండల కేంద్రంలో సర్వేనెంబర్ 397,403,499,771 లలో ప్రభుత్వ,అసైన్డ్ భూములలో కబ్జా లో ఉన్న రైతుల వివరాలను సర్వేయర్లతో సర్వే చేయించిన రెవెన్యూ బృందాలు కబ్జాలో ఉన్న వారి వివరాలు కలెక్టర్ కార్యాలయానికి ఇప్పటికే అందించారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు పట్టా భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసి అక్రమాలు జరుగుతున్నట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి..

పేపర్ పై 75 గజాలు.. ఫీల్డ్ మీద 140 గజాలు...

జర్నలిస్టులకు ఇంటి స్థలాల పేరుతో ఓ ప్రజాప్రతినిధి నుంచి లెటర్ అందగానే గతంలో ఇక్కడ పనిచేసిన ఎమ్మార్వో 13 మందికి ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున పల్లె ప్రకృతి వనానికి అనుకోని ఉన్న సర్వే నెంబర్ 771 లోని అసైన్డ్ భూమిలో 13 ప్లాట్లు తన ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు పల్లె ప్రకృతి వనం లోని స్థలంలో కొన్ని చెట్లను నరికి 75 గజాల చొప్పున 13 మందికి ప్లాట్లుగా ఆనాటి ఎమ్మార్వో రెవెన్యూ పత్రాలను చాటు మాటున వారికి అందజేశారు.కానీ ఆ వెంచర్లో ఫీల్డ్ మీద ఒక్కొక్కరికి 140 గజాలు ఆనాటి రెవెన్యూ అధికారులే చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పలువురు పత్రికా విలేకరులు ప్రస్తుత ఎమ్మార్వో కి తెలపగా.. ఫీల్డ్ మీదికి సర్వేయర్ ని పంపించి వివరాలు తెప్పించుకున్నట్టు సమాచారం.అక్కడ ఒక్కొక్కరికి 75 గజాలు కాకుండా 140 గజాలు ఉన్నట్లు సర్వేయర్ ఎమ్మార్వో కి తెలిపినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.

మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మధ్యవర్తులు భూములు రిజిస్ట్రేషన్,మార్పులు చేర్పులు,రెవిన్యూ పత్రాలు ఇప్పించేందుకు అధిక రుసుము వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఓ దందా కేంద్రంగా వ్యవహారం జరుగుతున్నట్టు బాహటంగానే పలువురు చర్చించుకుంటున్నారు. దీనికి రెవెన్యూ ఆఫీసులో పనిచేస్తున్న వారు సహాయ సహాకారాలు అందిస్తున్నట్టు చర్చ సాగుతోంది.దీనిపై ఉన్నతాధికారులు నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు.

భూములు ఆక్రమణ పై విచారణ చేపడతాం : అనిల్.ఎంఆర్ఓ

ప్రభుత్వ భూముల్లో అవకతవకలు,అక్రమాలు లు జరిగినట్లు తమ దృష్టికి తీసుకువస్తే విచారణ చేపడతాం.భూమి రిజిస్ట్రేషన్ లకు ఇతర పత్రాలకు రైతులు,అర్జీదారులు తహసీల్దార్ కార్యాలయంలో తమ పనులకు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు.ప్రభుత్వం సూచించిన రుసుము కంటే అధిక మొత్తంలో రుసుము వసూలు చేస్తే రైతులు నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు.అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..



Next Story