- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నల్గొండ జిల్లా నుండి ఇసుక, ఒండ్రు మట్టి అక్రమ రవాణాను అరికట్టాలి : కలెక్టర్

దిశ,నల్గొండ : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. వారు మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో ఇసుక ,ఒండ్రు మట్టి ,మొరం అక్రమ రవాణా, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ,అలాగే ఒండ్రు మట్టి సైతం రవాణా చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని ,దీనిని అరికట్టేందుకు జిల్లా ,డివిజన్, మండల స్థాయిలోని బృందాలు ఏర్పాటు చేస్తామని, ఈ బృందాలు పకడ్బందీగా పనిచేయాలని ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందాల్సిన అవసరం ఉందని, మండల స్థాయి బృందాలు, గ్రామస్థాయి బృందాలు బాగా పనిచేసినట్లయితే ఇసుక ఆక్రమ రవాణాను అరికట్టవచ్చని అన్నారు. ఇందుకుగాను డివిజన్ స్థాయిలో ఆర్డీవో, డీఎస్పీ ,డివిజనల్ పంచాయతీ అధికారి ,ఇరిగేషన్ అధికారులు ,మున్సిపల్ కమిషనర్ ఉన్నచోట మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఈ బృందంలో ఉంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ తో పాటు ,జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు, అడిషనల్ కలెక్టర్లతో కమిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా నుండి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ బృందాలపై ఉందని కలెక్టర్ అన్నారు.
అనుమతించిన ప్రదేశాలలో ఇసుక తవ్వకాలు జరిగే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం జిల్లాస్థాయిలో చిన్నచిన్న వాగులు ,పెద్ద వాగులలో , అలాగే గుర్తించిన ప్రదేశాలలో మాత్రమే ట్రాక్టర్లలో ఇసుక తరలించేందుకు మాత్రమే అనుమతిస్తుందని, టిప్పర్లలో ఎలాంటి పరిస్థితుల్లో అనుమతించదని, నదులు వద్ద ఇసుక తవ్వకానికి రాష్ట్ర స్థాయిలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా స్థాయిలో "మన ఇసుక వాహనం" ద్వారా అనుమతి తీసుకుని ఇసుకను పొందవచ్చని, ఇసుక అవసరమయ్యేవారు "మన ఇసుక వాహనం" ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా ఇసుక ఉందంటే అక్కడ మన ఇసుక వాహనం ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ ఇసుక రీచులు ఉన్నచోట అక్రమ రవాణా అరికట్టేందుకు సీసీ కెమెరాలుతో పాటు, ఇసుక వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రజలకు సరిపోయినంతగా ఇసుక దొరికే విధంగా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉందని, అయినప్పటికీ ఒకవేళ ఇసుక అక్రమ రవాణా జరిగినట్లయితే సంబంధిత బృందాల పైన ,బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని చెరువుల నుంచి అక్రమంగా ఒండ్రు మట్టిని తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ అక్రమ ఒండ్రుమట్టి రవాణా సైతం తక్షణమే నిలిపివేయాలని ,లేనట్లయితే అక్రమ ఇసుక రవాణా, ఒండ్రు మట్టి తరలించే వాహనాలను సీజ్ చేసి నేరుగా కోర్టులో అప్పగించడం జరుగుతుందని, ఎలాంటి పెనాల్టీ విధించకుండా కోర్టు ద్వారానే వాటిని విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల విషయంలో సైతం గట్టిగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అక్రమంగా ఇసుక రవాణా, ఒండ్రు మట్టి జరిగే చోట ఎలా అరికట్టాలో ప్రణాళిక రూపొందించుకోవాలని, జిల్లా నుండి ఒక్క వాహనం సైతం అక్రమంగా ఇసుక ,ఒండ్రు మట్టితో వెళ్లడానికి వీలులేదని తెలిపారు.ప్రభుత్వ మన ఇసుక వాహనానికి సెలవు రోజుల్లో ఎలాంటి అనుమతులు ఇవ్వడం జరగదని, తక్కిన రోజుల్లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక దొరకాలన్నదే తమ తాపత్రయం అని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు నల్గొండ జిల్లా కేంద్రం నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర, రెవెన్యూ అదనపు కలెక్టర్ జై .శ్రీనివాస్, ఆర్డీవోలు, తహసిల్దారులు, తదితరులు హాజరయ్యారు.