శివన్నగూడ సొసైటీలో భారీ కుంభకోణం..

by Sumithra |
శివన్నగూడ సొసైటీలో భారీ కుంభకోణం..
X

దిశ, మర్రిగూడ : శివన్నగూడ సొసైటీలో భారీ కుంభకోణం జరిగింది. రైతు సహకార సంఘంలో పనిచేసే సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా రూపాయలు 75 లక్షల 50 వేలు స్వాహా చేశారు. 8 సంవత్సరాల క్రిందట రిటైర్డ్ అయిన వ్యక్తి డబ్బులు స్వాహా చేయడానికి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రతి సంవత్సరం మార్చి మాసంలో జరిగే ఆడిటింగ్ లో అసలు పాలకవర్గం ఎందుకు అవినీతిని బయట పెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. పాలకవర్గం ముగిస్తుండడంతో లీకులు బయటపడ్డాయా...? అన్ని డబ్బులు స్వాహా చేయడానికి కారణాలు వెతికే పనిలో ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం.

మండలంలోని శివన్నగూడ గ్రామంలో ఉన్న శివన్నగూడ రైతు సహకార సంఘం అతిపెద్ద సంఘంగా సుమారు 50 ఏళ్ల కింద నుంచి రైతులకు సేవలు అందిస్తుంది. సొసైటీ లో పనిచేసే ముగ్గురు సిబ్బంది ఒకరు 40 లక్షలు స్వాహా చేస్తే మరొకరు రూ.13 లక్షలు, వేరొకరు రూపాయలు 12 లక్షల 50 వేలు సొంత అవసరాలకు వాడుకున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే పాలకవర్గం మీటింగులో సొసైటీ మొత్తం లావాదేవీల గురించి సీఈవో చర్చ పెడతారు. కానీ ఇంత పెద్ద స్కాము ఎందుకు చర్చ జరగలేదనేది విస్తృతంగా చర్చ జరుగుతుంది.

2016 లో రిటైర్డ్ అయిన ఉద్యోగికి నెలకు 50 వేలకు పైన వేతనమిస్తూ ఎందుకు కొనసాగిస్తున్నారు..? దీని వెనుక ఎవరు ఉన్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సొసైటీ పాలకవర్గం ముగిసే నాటికి ఇది బయటికి పొక్కడం ఉన్నతాధికారులకు చైర్మన్ ఫిర్యాదు చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి స్వాహా అయినా డబ్బును రికవరీ చేయాలని సొసైటీ పరిధిలో ఉన్న రైతులు కోరుతున్నారు. సొసైటీ పరిధిలో కుదబక్షపల్లి, అంతంపేట, నామపురం, మేడ్ చందాపురం, కొట్టాల ఇందుర్తి, శివన్న గూడెం, సరంపేట, రాంరెడ్డిపల్లి, వెంకీ పల్లి, లెంకలపల్లి, దామెర భీమనపల్లి, నాంపల్లి మండలం దామెర గ్రామపంచాయతీ సైతం సొసైటీ సేవలందిస్తుంది. సొసైటీలో జరిగిన భారీ కుంభకోణం పై రైతులు అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రిటైర్డ్ ఉద్యోగి అసలు సూత్రధారి..

శివన్నగూడ రైతు సహకార సంఘంలో సుమారు 30 సంవత్సరాల పైబడే ఒక ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. ఆ ఉద్యోగి 2016 లో రిటైర్డ్ అయ్యాడు. కానీ ఆ ఉద్యోగినే సుమారు 60 వేల వేతనం ఇస్తూ అతన్నే కొనసాగిస్తున్నారు. ఆ ఉద్యోగి రూపాయలు 40 లక్షలు స్వాహా చేసినట్లుగా తెలుస్తుంది. రిటైర్డ్ అయిన ఉద్యోగిని అంత పెద్ద ఎత్తున వేతనం ఇస్తూ అతన్నే ఆ పోస్టులు ఎందుకు కొనసాగిస్తున్నారు...? అతని వెనుక ఉన్న పెద్దలు ఎవరు...? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరొక ఇద్దరు 25 లక్షల 50 వేలు స్వాహా చేసినట్లుగా తెలుస్తుంది.

చైర్మన్ ఫిర్యాదుతో అవినీతి బట్టబయలు..

శివన్నగూడ రైతు సహకార సంఘంలో 75 లక్షల 50 వేల రూపాయలు స్వాహా పై చైర్మన్ బాలం నరసింహ జిల్లా అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒకరు 40 లక్షలు, ఇంకొకరు 13 లక్షలు, వేరొకరు 12 లక్షల 50 వేలు స్వాహా చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొనడంతో సహా పర్వం వెలుగులోకి వచ్చింది.



Next Story