Governor of Tripura: గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ కాదు

by Kalyani |
Governor of Tripura:  గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ కాదు
X

దిశ,తుంగతుర్తి: గవర్నర్ పదవి అంటే రబ్బర్ స్టాంపు కాదని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. ఈ అపోహ గత కొంతకాలం నుంచి వస్తున్నప్పటికీ అందులో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్ పదవికి ఒక ప్రత్యేకమైన ఉన్నత పాత్ర ఏర్పడిందన్నారు. గవర్నర్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం తనకు జరిగిన ఆత్మీయ సన్మాన సభలో ప్రసంగించారు. త్రిపుర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో విస్తృతంగా పర్యటించి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పై అధికారులతో సమీక్షలు నిర్వహించడమే కాకుండా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుకు సాగానని వివరించారు.

ప్రపంచంలోనే త్రిపుర రాష్ట్రానికి వివిధ రంగాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని తెలిపారు. వ్యవసాయం,రబ్బర్ తోటలు, అగర్తాల్, తదితర వాటిపై ఒక స్థానం అంటూ ఏర్పడిందన్నారు. ముఖ్యంగా రాష్ట్రం మూడు వైపుల బంగ్లాదేశ్ బోర్డర్ 850 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉందని వివరించారు. రాష్ట్రంలో 70 శాతం అటవీ ప్రాంతమైనప్పటికీ అందులో 35 శాతం ట్రైబల్స్ ఉంటారని తెలిపారు.ట్రైబల్స్ కు సంబంధించి ఎన్నిక కూడా ఒక ప్రత్యేకతతో కొనసాగుతుందని వివరించారు. బంగ్లాదేశ్-త్రిపుర రాష్ట్రాల మధ్య బోర్డర్ లో జరిగే సంతలో ఇరు ప్రాంతాలవారు వ్యాపారాలు కొనసాగిస్తుంటారని, వీరి మధ్య సంబంధాలు మరింత పెంచే కార్యక్రమం సాగుతుందని తెలిపారు.

దేశంలోనే అత్యంత ప్రశాంతతతో కొనసాగుతున్న త్రిపుర రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిన సంక్షేమ పథకాలు నేడు వేగవంతమయ్యాయని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఈనెల 30,31 తేదీలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయని వివరించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేరి వెంకటేశ్వరరావు కోరిక మేరకు తుంగతుర్తి మండలంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిపై నేరుగా ప్రధాని మోడీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు, నాయకులు సంకినేని రవీందర్ రావు, జుట్టుకొండ సత్యనారాయణ, మల్లెపాక సాయిబాబు, కడియం రామచంద్రయ్య, కాప రవి,తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed