- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వృథాగా ప్రభుత్వ భవనాలు

దిశ, హాలియా: ప్రభుత్వం లక్షలు వెచ్చించి ప్రభుత్వ భవనాలు నిర్మించినప్పటికీ వాటిని ఉపయోగించుకోవడంలో పాలనా యంత్రాంగం విఫలమవుతోందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. హాలియాలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయం గత కొన్ని సంవత్సరాలుగా నిష్ప్రయోజనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని మిషన్ భగీరథ విభాగంలో కలపడంతో కొన్ని సంవత్సరాల పాటు పాత మండల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించారు. కాగా గతంలో ఈ కార్యాలయ భవనం స్లాబ్ కురవడంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా ఇతర భవనానికి మార్చారు. ప్రస్తుతం మిషన్ భగీరథ కార్యాలయాన్ని హాలియా తాగునీటి పథకం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేశారు.
దీంతో పాటు గతంలో పంచాయతీరాజ్ శాఖ విభాగం సబ్ డివిజన్ ఆఫీస్ నూతన భవనం నిర్మించడంతో పాత భవనం ఉపయోగంలోకి లేకుండా పోయింది. కొంతకాలం పాటు సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయం ఏర్పాటు చేయగా ఈ శాఖ ప్రైవేటు భవనంలోకి మార్చారు. దీంతోపాటు పాత గ్రామ పంచాయతీ కార్యాలయం పాత పశువైద్యశాల తదితర భవనాలు ఉపయోగం లేకుండా వృథాగా పడి ఉన్నాయి. వ్యవసాయ శాఖ కార్యాలయం గత 30 ఏళ్లుగా ప్రైవేట్ భవనంలోనే నడిపిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉంచి అధికారులు ప్రైవేట్ భవనాలపై మక్కువ చూపించడంతో ఏటా రూ. లక్షలాది రూపాయలు అద్దెలకే చెల్లిస్తున్నారు. అధికారులు సంబంధిత శాఖల భవనాలను ఉపయోగంలోకి తేవడం ద్వారా ప్రభుత్వం పై ఖజానా భారం తగ్గనుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.