గంధమల్ల రిజర్వాయర్ ఆమోదం తెలిపిన ప్రభుత్వం

by Mahesh |
గంధమల్ల రిజర్వాయర్ ఆమోదం తెలిపిన ప్రభుత్వం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి నీళ్లందించే గంధమల్ల రిజర్వాయర్ కల సాకారమవ్వనుంది. ఈ గంధమల్ల రిజర్వాయర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించింది. 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు రిజర్వాయర్ నిర్మాణ పనులకు రూ. 575.55 కోట్లతో అనుమతులను సైతం మంజూరు చేసింది.

మొదట 9.36 టీఎంసీలతో..

గంధమల్ల వద్ద ఈ రిజర్వాయర్ ను మొదట 9.36 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌‌ను నిర్మించాలని 2017లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ, నిర్మాణ పనుల ప్రక్రియను ప్రారంభించింది. అయితే భారీగా 9.36 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం అంటే పెద్ద ఎత్తున భూసేకరణ చేయాల్సి వచ్చింది. దీంతో మరోసారి అప్పటి ప్రభుత్వం భూ సేకరణ దృష్ట్యా రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీలకు కుదించింది. అయిన కూడా చుట్టుపక్కల ఉన్న ముంపు గ్రామాల నుంచి నిరసన వ్యక్తం అయింది. ఇలా నిరసనలు వ్యక్తం కావడంతో రిజర్వాయర్ ను 1.41 టీఎంసీలకు కుదించాలని నిర్వహించారు. ప్రభుత్వం 1.41 టీంఎసీల ప్రతిపాదనను చేసింది. ఇందులో భాగంగా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

భూ సేకరణకు సిద్ధమైన అధికారులు..

రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు భూసేకరణకు సిద్ధమయ్యారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు భూసేకరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ భూసేకరణకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డిలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. గంధమల్ల రిజర్వాయర్ కొరకు భూ సేకరణ నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతంగా తగిన కార్యాచరణ రూపొందించాలని సూచించారు‌.

ఈ రిజర్వాయర్ వల్ల అతి తక్కువ భూసేకరణ, ఎలాంటి ముంపు గ్రామాలు లేకుండా 1.41 టీఎంసీ ప్రతిపాదనతో ప్రభుత్వం నిర్ణయించడంతో తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు సలహాలు అందించారు‌‌. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు 1000 ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా గంధమల్ల, వీరారెడ్డిపల్లి రెవెన్యూ నుంచి సేకరించాల్సి ఉండగా, ఇందులో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ నుంచి సైతం కూడా భూ సేకరణ చేపట్టనున్నారు.

గోదావరి జలాలతో ఆలేరు సస్యశ్యామలం : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

వీలైనంత త్వరగా రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసి గోదావరి జలాలతో ఆలేరు నియోజకవర్గాన్ని పూర్తి సస్యశ్యామలం చేస్తాం. ఎన్నికల హామీలలో ఇచ్చిన గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణ పనులను నిలబెట్టుకుంటున్నాం. గంధ మల్ల రిజర్వాయర్ ద్వారా ఆలేరు నియోజకవర్గానికి సాగునీటి కొరతను తీర్చి, పూర్తిగా పంటపొలాలను పచ్చగా మార్చాలనే దృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం.



Next Story

Most Viewed