ఎట్టకేలకు యాదగిరిగుట్ట పైకి ఆటోలకు అనుమతి

by Naresh |
ఎట్టకేలకు యాదగిరిగుట్ట పైకి ఆటోలకు అనుమతి
X

దిశ,యాదగిరిగుట్ట: రెండు సంవత్సరాలుగా ఆటో కార్మికులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు సఫలీకృతమైంది. యాదాద్రి కొండ పైకి ఆటోలను అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం 22-3-2022 నుంచి కొండపైకి ఆటోలను నిషేధించింది. ఆటోల నిషేధంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ సుమారు 300 మంది ఆటో కార్మికులు నాటి నుంచి వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొండపైకి ఆటోలను అనుమతిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాటకు అనుగుణంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వివిధ శాఖల అధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే, రామకృష్ణారావుతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం తుది సమీక్ష నిర్వహించి కొండపైకి ఆటోలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఉదయం 50, మధ్యాహ్నం 50 ఇలా రోజుకు 100 ఆటోలను మొదటి ఘాట్ రోడ్డు నుంచి మాత్రమే అనుమతిస్తామని, ప్రతి ఆటోకు నెంబరింగ్ విధానాన్ని కేటాయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రవాణా శాఖ నిబంధనలు కచ్చితంగా అమలవుతాయని స్పష్టం చేశారు. ఆటోలో ముగ్గురు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని, ఆటోకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్, అనుభవంతో కూడిన డ్రైవర్, కాకి చొక్కా తప్పనిసరి అని తెలియజేశారు. దేవస్థానం నిర్ణయించిన ధరలను మాత్రమే ప్రయాణికుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ నరసింహ మూర్తి, డీసీపీ రాజేష్ చంద్ర, డీఈవో దుర్బల భాస్కర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed