ప్రధాని మోదీకి జేబు సంస్థగా ఈడీ

by Naresh |   ( Updated:2024-03-23 14:45:34.0  )
ప్రధాని మోదీకి జేబు సంస్థగా ఈడీ
X

దిశ, సూర్యాపేట: దేశ ప్రధాని నరేంద్ర మోదీకి జేబు సంస్థలుగా ఈడీ,ఏటీఎం కార్డులుగా కార్పొరేట్ కంపెనీలు మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్న నిఘా సంస్థలను ఊసురు గొలిపి అనేక దాడులు చేస్తుందని ఆరోపించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షగట్టి, గవర్నర్ల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు సాగకుండా అడ్డుపడుతూ ఆటంకం పరుస్తున్నారని మండి పడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న మతోన్మాద చర్యలను వ్యతిరేకించిన రచయితలపై, ప్రజాస్వామిక వాదుల పై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని విమర్శించారు.

ఇండియా కూటమిని పూర్తిగా బలహీన పరచాలని ఉద్దేశంలో భాగంగా రకరకాల ఎత్తులు, జిత్తులు చేస్తున్నారని అన్నారు. దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి వేస్తామని బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రకటించిన బీజేపీ రానున్న ఎన్నికల్లో ఓడించాలన్నారు. భువనగిరి పార్లమెంట్ నుంచి సీపీఎం పోటీ చేస్తుందన్నారు. మిగతా స్థానాల విషయంలో ఆలోచించి తగు నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితి నెలకొని ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టిన ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే కరువు మండలాలు ప్రకటించి కరువు సహాయం చేయాలన్నారు. రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి పాల్గొన్నారు.



Next Story

Most Viewed