Collector: డెంగ్యూ కేసులపై భయాందోళన కల్పించొద్దు

by Kalyani |
Collector: డెంగ్యూ కేసులపై భయాందోళన కల్పించొద్దు
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : ప్రైవేటు ఆసుపత్రులు డెంగ్యూ కేసుల పట్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు కల్పించొద్దని జిల్లా కలెక్టర్ హనుమంత్ కె. జండగే అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులపై ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజలు జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చినప్పుడు పరీక్షల అనంతరం నిర్ధారణ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో జ్వరాలను డెంగ్యూ గా ప్రకటించొద్దని ఆదేశించారు. దీనివల్ల ప్రజలు అనవసరమైన భయాందోళనలకు గురవుతారని, అందువలన డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చిన చోట తప్పనిసరిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి లేదా సంబంధిత ఏరియా, పి హెచ్ సి వైద్యాధికారికి తెలియజేయాలన్నారు.

వైద్యాధికారులు, పంచాయతీలు, మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జ్వరం ఉన్న కేసులు శాంపిల్ లను టీ డయాగ్నొస్టిక్ సెంటర్ కి పంపి పరీక్షలు చేయించాలన్నారు. రూట్ కాజ్, దోమ నివసించే ప్రదేశాలను గుర్తించి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులకు బిల్లుల విషయంలో మానవతా దృక్తకంతో చార్జీలు వసూలు చేయాలన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం డాక్టర్ ఎవకరూ వైద్యం చేస్తున్నారు అన్నది అలాగే తీసుకునే ఫీజు ఆసుపత్రి కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అన్ని వివరాలు ఆసుపత్రికి వచ్చే వారికి తెలిసే విధంగా ప్రదర్శించాలన్నారు.

అలాగే ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను సైతం ప్రదర్శించాలన్నారు. ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ ను తప్పనిసరిగా చేపట్టాలన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు అనవసరంగా సిజేరియన్ వైపు వెళ్ళొద్దని తెలిపారు. ఈ సమావేశంలో లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గంగాధర్, డాక్టర్ యశోద, డా. రాజారావు, సూపరింటెండెంట్, మెడికల్ కాలేజ్ భువనగిరి, డిసీ హెచ్ ఎస్ డా. చిన్నా నాయక్, ప్రోగ్రాం అధికారులు డా. సాయి శోభ, డా. శిల్పిని, డా. రామకృష్ణ, డా. వీణ, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed