జోరుగా అసైన్డ్ భూముల దందా.. కన్నేసిన వ్యాపారులు

by Javid Pasha |
జోరుగా అసైన్డ్ భూముల దందా.. కన్నేసిన వ్యాపారులు
X

దిశ, మునుగోడు: అసైన్డ్ భూముల చట్టం... ఎన్నో ఏళ్లుగా పేదలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, వర్గాల వారి జీవితాలకు అండగా నిలిచిన చట్టం. అసైన్డ్ భూములు వ్యవసాయ పనులకు తప్ప వ్యవసాయేతర పనులకు వాడకూడదు. కానీ మునుగోడు మండలంలో రహదారి సమీపంలో ఉన్న అసైన్డ్ భూములుపై వ్యాపారులు కన్నెశారు. దీంతో అసైన్డ్ భూముల దందా జోరుగా సాగుతుంది. దళారులు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. పేదల వద్ద అసైన్డ్ భూములకు వ్యాపారులు నయానో భయానో చెల్లించి కోట్లకు పడుగెడుతున్నారు. కొందరు వ్యక్తులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి వ్యాపార సముదాయాల కోసం పక్క భవనాలు నిర్మించుకుంటున్నారు. రహదారి పక్కన ఉండడంతో డిమాండ్ బాగానే ఉంది. తప్పుడు రిజిస్ట్రేషన్ కొత్తగా సృష్టించి భూములను కబ్జా చేస్తున్నారు.

సాగు కోసం కేటాయించిన భూములను కొత్త తరహాలో ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అసైన్డ్ భూములు నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్న అవేమీ పట్టనట్లు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మునుగోడు మండల కేంద్రంలో మునుగోడు-నల్గొండ రహదారి సమీపంలో ఉన్న 973అ2 సర్వే నెంబర్ లో బొమ్మరగొని మారమ్మ పేరున ఉన్న అసైన్డ్ భూములో కొందరు సుమారు 34 గుంటలు భూమిని కొనుగోలు చేసి ధరణిలో రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ప్లాట్లుగా విభజించి చండూరులో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడంతో పెద్ద సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అసైన్డ్ భూమిలో వ్యవసాయ పనులకు కాకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన వారు పట్టినట్లు వ్యవహరిస్తుండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

నోటీసులతోనే సరి..

అసైన్డ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు ఒకటి, రెండు రోజులు పనులు ఆపినట్లు చేసి మరుసటి రోజు సెలవు దినం సమయంలో పనులు కొనసాగిస్తున్నారు. అధికారులు నోటీసులు ఇచ్చి పర్యవేక్షణ లేకపోవడంతో నిర్మాణ కట్టడాలు ఆగడం లేదు. ఇప్పటి వరకు నిర్మాణాలు ఆపడం తప్ప అక్రమ కట్టడాలు తొలగించడంలో అధికారులు మొగ్గు చూపడం లేదు. ఉన్నతాధికారులకు నివేదిక పంపామని వారు ఆదేశాల మేరకు తొలగిస్తామని మాటలతో కాలయాపన చేస్తున్నారు. దీంతో అక్రమార్కులకు వరముగా మారింది. ఒకటి, రెండు రోజులు పనులు ఆపినట్లు చేసి మరుసటి రోజు పనులు కొనసాగిస్తూ ఇలా వారి ఆశయాలను సాధించేంత వరకు ముందుకెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి అక్రమ కట్టడాలపై కొరడ జులుపించాలని కోరుతున్నారు. ఇలాగే కొనసాగితే సాగు చేసుకునేందుకు అసైన్డ్ భూములు కనుమరుగవుతాయని, పేదవారి భూములకు పైసలు ఆశలు చూపి అసైన్డ్ భూమిని సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి అక్రమదారులపై చర్యలు తీసుకొని అక్రమ కట్టడాలను తొలగించాలని మండల వాసులు కోరుతున్నారు.



Next Story

Most Viewed