- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మాకెందుకీ తిట్లు.. కలెక్టర్ గారు జర ఓపెన్ చేయించండి..!

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): వసతుల లేమితో బాధపడుతున్న వారు కొందరైతే.. అన్ని వసతులు సమకూరినప్పటికీ కాంట్రాక్టర్లకు ప్రజాప్రతినిధులు సమయం కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు మరికొందరు. సరిగ్గా ఈ కోవలోనిదే జాజిరెడ్డిగూడెం ఉభయ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారుల దీనావస్థ. ఇక నేరుగా విషయానికొస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ,విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా నూతన తరగతి గదులు, ప్రహారీ గోడల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటుగా విద్యార్థినీ, విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య టాయిలెట్లు లేకపోవడం. వీటిని ఏర్పాటు చేసే సదుద్దేశంతో ఈ విద్యాసంవత్సరంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జాజిరెడ్డిగూడెం మండలంలో మొత్తం 11 పాఠశాలలకు నిధులు మంజూరు కావడంతో పనులను ప్రారంభించి, పూర్తి చేశారు.
ఇందులో భాగంగా జాజిరెడ్డిగూడెం మండల ప్రాథమిక,ఉన్నత పాఠశాలలో ప్రహారి గోడతో పాటు మూత్రశాలలను నిర్మించి, ఏడాది కాలం పూర్తయింది. అయినా వీటిని ప్రారంభించక పోవడంతో విద్యార్థులు పాఠశాల పరిసరాల్లోని ఇళ్ల మధ్యలో మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో దుర్వాసనను భరించలేని పరిసర ప్రజలు విద్యార్థులను తిడుతున్నారని, టాయిలెట్లు ప్రారంభిస్తే మాకెందుకీ తిట్లు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలికల విషయానికొస్తే ప్రహారి, టాయిలెట్ గోడల మధ్య బాలికలు తెరచాపలుగా కాపలా ఉంటే గానీ.. మూత్ర విసర్జన చేయలేని దయనీయ పరిస్థితుల్లో బయటకు చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి, సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.