అంగరంగ వైభవంగా ప్రారంభమైన చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు..

by Naveena |   ( Updated:2025-02-04 12:14:40.0  )
అంగరంగ వైభవంగా ప్రారంభమైన చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు..
X

దిశ ,నార్కట్ పల్లి: జిల్లాలోనే ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావదాని ఆచార్యతంలో, దేవాలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ బృందం ఆధ్వర్యంలో.. వేద మంత్రాలు పటిస్తుండగా బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా దేవాలయ మహా మండపంలో గణపతి పూజ, పుణ్యాహవచం నిర్వహించి.. దేవత మూర్తులకు ఆహ్వానం పలికి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అంతకుముందు ముఖ్య అతిథిగా పాల్గొన్న జెసి దంపతులకు ఈవో నవీన్ కుమార్ స్వాగతం పలకగా అర్చకులు పూర్ణకుంభం పట్టారు. అదేవిధంగా ప్రధాన ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి కృష్ణ, జిల్లా ఎండోమెంట్ ఏసి కే. భాస్కర్, స్థానిక నాయకులు బత్తుల ఊషయ్య గౌడ్, నేతకాని కృష్ణ, వడ్డే భూపాల్ రెడ్డి, గడుసు శశిధర్ రెడ్డి, ఇల్లందుల కిట్టు, రేగట్టే నవీన్ రెడ్డి, రేగట్టై రాజశేఖర్ రెడ్డి, వారాల రమేష్, సూపరిండెంట్ తిరుపతి రెడ్డి, సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం రాత్రి నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ తెలిపారు. గట్టు పైకి చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆటోలు ఏర్పాటు చేశామన్నారు. భారీ సంఖ్యలో వచ్చే జనానికి కల్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి టీవీలను అందుబాటులో ఉంచామన్నారు. 24 గంటలు వాలంటీర్లు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వాహనాల ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.

బ్రహ్మోత్సవ శోభతో ఆలయ పరిసరాలు కళకళలాడుతున్నాయి. దేవాలయానికి విద్యుత్ దీపాలు వేయడంతో..ఆ ప్రాంతమంతా ప్రత్యేకతను చాటుతుంది. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉన్నటువంటి శిలాషోడశస్తంభ కళ్యాణ మండపాన్ని ప్రత్యేక పుష్పాలు, విద్యుత్ లైట్లతో ఏర్పాట్లు చేశారు. గట్టుకు చేరుకున్న భక్తులు కల్యాణ మండపాన్ని చూసి తరించిపోతున్నారు. దేవతామూర్తుల కళ్యాణం చూసేందుకు తహతహలాడుతున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామి వారి కళ్యాణం జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.



Next Story