- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సర్వేనెంబర్ల మార్పు.. అన్నదాతకు అందని రైతు భరోసా..

దిశ,చండూరు : అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సహాయం అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గట్టుప్పల్ మండలం అంతంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సోమరాజు తండాలో సర్వే నెంబర్ 281 లో గత యాభై సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేద రైతులకు భూములను పంపిణీ చేసింది. కానీ పట్టాల పంపిణీ సమయంలో అధికారులు 281 సర్వే నంబరకు బదులు గుట్టలు ఉన్న 280 సర్వే నెంబర్ లో భూములను రైతులకు పంపిణి చేసినట్లు పొరపాటున రికార్థులల్లో నమోదు చేసారని రైతులు ఆరోపిస్తున్నారు . గత ప్రభుత్వం అన్ని రకాల భూములకు రైతుబంధు సహాయం అందించడం తో వీరికి కూడా పెట్టుబడి సహాయం అందింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తుంది. దీంతో సోమరాజు తండాలో 280 సర్వే నెంబర్లో గుట్టలు ఉన్న ప్రాంతంలో పట్టాలు పొందిన 50 మంది రైతులకు ఈ దఫా రైతు భరోసా నిలిచి పొయింది.గత కొన్ని సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటూ ప్రభుత్వం నుండి వచ్చే రైతు భరోసా సహాయాన్ని పొందుతున్న రైతులు అధికారుల తప్పు వల్ల తమకు రైతు భరోసా నిలిపివేయటం అన్యాయమని, తమకు రైతు భరోసా అందించే విధంగా అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 6న కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం తో గత సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని రైతు లల్లో ఆందోళన నెలకొంది .ఈ విషయం పై తహసీల్దార్ రాములును వివరణ కోరగా దీనిపై జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించినట్లు తెలిపారు.
రికార్థులను సరిచేసి మాకు న్యాయం చేయాలి..: రమావత్ శ్రీను నాయక్, రైతు
గత నాలుగు తరాలుగా ఇదే సర్వే నంబర్లో మేము భూమి సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాం . ఇప్పుడు అధికారులు సర్వే నెంబర్ తప్పు అని రైతు భరోసా నిలిపివేశారు. రికార్డుల్లో సర్వే నెంబర్ ను సరిచేసి మాకు న్యాయం చేయాలి.
రైతుల పక్షాన పోరాటాలు చేస్తాం.: కర్నాటి సుధాకర్.
రైతులకు జరిగిన అన్యాయం పై ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాం. అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రికార్దుల్లో జరిగిన పొరపాటును సరి చేసి రైతులకు పెట్టుబడి సహాయం అందేవిదంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేనిచో రైతుల పక్షాన పోరాటాలు చేపడుతాం.