పొలాలు ఎండుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనిపించడం లేదా...?

by Naresh |
పొలాలు ఎండుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనిపించడం లేదా...?
X

దిశ, హుజుర్ నగర్ : అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కేంద్రానికి భయపడి ప్రాజెక్టులు అప్పజెప్పు తున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తో కలిసి జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని అన్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో రైతుల పంట పొలాలు ఎండుతున్న రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చలనం రావడం లేదని అన్నారు. గత కొన్ని రోజుల క్రితం సాగర్ నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించిన విధంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని చెరువు లన్నింటిని నింపే విధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్యలు చేపట్టాలని అన్నారు.

నాగార్జునసాగర్ నీళ్లు ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని మేము అడిగితే, కాళేశ్వరం ప్రాజెక్టునో,మేడిగడ్డ ప్రాజెక్టునో పట్టుకొని అవినీతి జరిగిందంటూ ప్రగాల్పాలు పలుకుతున్నారని అన్నారు. పెద్ద, పెద్ద ప్రాజెక్టులు కడుతున్నప్పుడు టెక్నికల్ ఇష్యూస్ రావడం సర్వసాధారణమని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వారి పైనే ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభ పెడుతుంటే ఆ సభను చూసి భయపడుతూ మేడిగడ్డ సందర్శన అంటూ చిత్రమైన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. రైతుల పొలాలు ఎండుతున్న, గ్రామాల్లో మూగజీవాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవేవీ కనిపించడం లేదని అన్నారు. చలో నల్గొండ సభను విజయవంతం చేసేందుకు రైతులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ గతంలో నీటి కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే ఉద్యమం ప్రారంభించామని, నేడు కూడా అదే స్థాయిలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మరో నీటి ఉద్యమం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని స్వాగతిస్తాం - మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని తాము స్వాగతిస్తామని, కానీ కాంగ్రెస్ పార్టీ లాగా కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోబోమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ట్యాంక్ బండ్, హుజూర్ నగర్ రింగ్ రోడ్డు, మరి కొన్ని అభివృద్ధి పనులు 70 శాతం పూర్తయ్యాయని, వాటిని కూడా బాధ్యత తీసుకొని పూర్తి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నెస్పీ క్యాంపులో, మరికొన్ని చోట్ల భూమి మున్సిపాలిటీ లోకి ఎక్కించి అవకతవకలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అక్రమాలకు పాల్పడితే ఎలా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాగర్‌లో నీరు డెడ్ స్టోరజి లో ఉన్నా, తమ ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు ఇబ్బంది పడవద్దని, రైతుల అవసరం తెలుసుకుని వారికి సాగు నీరు అందించామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలు సాగు, తాగు నీటికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రేపు(మంగళవారం )నల్గొండలో జరిగే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మత్తడి నిర్మాణం పనుల్లో అక్కడక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటంతో వాటిని తగ్గించేందుకు బ్లాస్టింగ్ అనుమతుల కోసం మంజీరా నది ప్రాంతాన్ని పరిశీలించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ బిక్షపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చందూరి అంజయ్య, సర్వేయర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed