ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది.. పల్లా వెంకటరెడ్డి

by Sumithra |
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది.. పల్లా వెంకటరెడ్డి
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : ఎస్ఎల్బిసీ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి ఆరోపించారు. నిర్ణీత సమయంలోపు ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్టులను పూర్తిచేసే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. శనివారం మునుగోడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు కూడా నీరును అందించే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం అభినందనీయమన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో పల్లా వెంకటరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ లో రెండు టన్నెల్ ద్వారా నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం సంతోషకరమన్నారు. రెండు మూడు సంవత్సరాలలోపే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని, డిండి లిఫ్ట్ డీపీఆర్ తయారుచేసి పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చిందని అన్నారు.

మునుగోడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా లబ్ది పొందే జాబితా నుండి తొలగించారని వాటిని కూడా కలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తామని తెలిపారు. డిసెంబర్ 26న సీపీఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నల్లగొండలో 50 వేల మందితో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ఎనలేనిదని నిర్బంధాలు, జైలు అనుభవించిన వారిలో కమ్యూనిస్టులు ముందు ఉంటారని అన్నారు. ఎలాంటి చరిత్ర లేని పార్టీ నాయకులు నేడు పోజులు కొడుతున్నారని, దేశ నిర్మాణం భూ పంపిణీలో కమ్యూనిస్టుల పాత్ర అమోఘమైందని గుర్తు చేశారు. సీపీఐ పార్టీ 100 సంవత్సరాల చరిత్రను తెలియజేసేందుకు డిసెంబర్ 30 నుండి సంవత్సరం పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని, వీటికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డిలు కూడా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, అంజాచారి, కే.శ్రీనివాస్, బచ్చనబోని గాలయ్య, దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, పల్లె మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed