- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అంతా మా ఇష్టం.. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఇటుక బట్టీలు

దిశ, ఎం తుర్కపల్లి: అంత మా ఇష్టం.. మనల్ని ఎవరు రా ఆపేది అనే తీరుగా అడ్డూ అదుపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సాగుతుంది ఇటుక బట్టీల వ్యాపారం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల బట్టీలు వెలుస్తున్నాయి. ప్రజలు నివసించే ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇటుక బట్టీలు తయారు చేయాలని నిబంధనలు ఉన్నా వాటిని వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మండలంలోని వీరారెడ్డిపల్లి, మల్లాపూర్, తదితర గ్రామాల్లో ఇటుకల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటుకల విక్రయాలతో ప్రధానంగా వాణిజ్య పన్ను శాఖ సంవత్సరానికి లక్షలలో నష్టపోతూ తమ ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక్కో ఇటుకకు ఆరు నుంచి ఏడు రూపాయల చొప్పున వ్యాపారులు వసూలు చేస్తున్నా చాలామంది వ్యాపారులు ప్రభుత్వానికి నయాపైసా కూడా చెల్లించడం లేదు. వ్యాపారులు ఐదు శాతం (వ్యాట్) చెల్లించడం గాని అనుమతులు పొందడం లాంటివి చేయడం లేదని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటుకల తయారీ కోసం కోసం పొలాలు, గుట్టలలో, అటవీ ప్రాంతంలోని మట్టిని తవ్వి ఇటుకలు తయారు చేస్తున్నారు. మట్టిని తవ్వాలంటే భూగర్భ శాఖ, గ్రామ పంచాయతీ అనుమతి కూడా ఉండాలి. మండలాలలో కుప్పలు తెప్పలుగా ఇటుక బట్టీలు వెలిసినా ఏ ఒక్క దానికి అనుమతులు లేనట్లు తెలుస్తోంది. ఇటుకలూ విక్రయించగా అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వీటికి ఐదు శాతం ఉంటుంది. ఈ విక్రయాలకు పన్ను చెల్లించాల్సి ఉన్నా అది కూడా అమలు కావడం లేదు.
నిబంధనలకు విరుద్ధంగా బట్టీల నిర్వహణ
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటుక బట్టీల నిర్వహణ చేయాలంటే గ్రామ పంచాయతీ ,రెవెన్యూ అధికారుల, కార్మిక శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, ఫారెస్ట్ తదితర శాఖల వద్ద అనుమతులు పొందాలి. ప్రజా నివాస ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో పంట పొలాలకు కనీసం వంద మీటర్ల దూరంలో, ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ బట్టీల నిర్వహణ కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా ఎటువంటి నియమాలు పాటించకుండా జనావాసాల మధ్య బట్టీలు ఏర్పాటు చేయడంతో దాని నుంచి వచ్చే కాలుష్యం వలన చాలా ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.
అధికారుల చర్యలేవి
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు వెలుస్తున్న సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో మట్టి కోసం చెరువులు, పొలాలు, గుట్టలను తవ్వుతున్నా అటవీశాఖ అధికారుల్లో చలనం కనిపించడం లేదు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నా బట్టీలపై దాడులు చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారికి వచ్చే మామూళ్లతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యాపారం జోరుగా సాగుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు పేర్కొంటున్నారు.
బట్టీల్లో మగ్గుతున్న బాల్యం..
6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలంతా విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలో ఉండాలి. కానీ ఇటుకలు తయారు చేసే కార్మికుల పిల్లలు బాల్యం మట్టిలోనే మగ్గుతోంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా మట్టి పనిలోనే నిమగ్నమయ్యారు. విద్యాశాఖ, కార్మిక శాఖ అధికారుల పట్టింపు లేని తనంతో వారి బాల్యం బుగ్గి పాలు అవుతుందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకార్మికులను పనులలో తీసుకుంటే ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రెండు లక్షల వరకు జరిమానా విధించాలని న్యాయస్థానం కార్మిక శాఖ అధికారులకు హెచ్చరించింది. బాల కార్మిక వ్యవస్థ, నిర్మూలనపై ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రకాలుగా అవగాహన కల్పించినా వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. బాల కార్మికులతో పని చేయడం నేరం కదా అని ఇటుక బట్టీల వ్యాపారులు ప్రశ్నించగా పిల్లలకు సెలవులు ఉన్నాయి కదా అందుకే పిల్లలు పని చేస్తున్నారని సమాధానం ఇవ్వడం గమనార్హం.