ఇటుక దందా ఇష్టారాజ్యం.. రూ.కోట్లలో వ్యాపారం

by Aamani |
ఇటుక దందా ఇష్టారాజ్యం.. రూ.కోట్లలో వ్యాపారం
X

దిశ,మిర్యాలగూడ టౌన్ : అధికారుల ఉదాసీనత వలన ఇటుక బట్టిల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మారింది. పర్యవేక్షణ చేసే అధికారుల నిర్లక్ష్యం సాక్షి గా ఇటుక బట్టీల వ్యాపారుల హవా సాగుతోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్లిన అధికారులు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కోట్ల విలువ చేసే ఇటుక వ్యాపారం నిబంధనలు అతిక్రమించి జోరుగా నిర్వహిస్తున్నారు.

కోట్లలో వ్యాపారం

మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడ , మాడ్గులపల్లి , వేములపల్లి , దామరచర్ల మండలాలలో సుమారు 100 వరకు అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుకల బట్టీలు ఉన్నాయి. ఒక్కొక్క బట్టి సుమారురూ. 20 లక్షల కెపాసిటి నుంచి కోటి ఇటుకల కెపాసిటి వరకు తయారు చేస్తున్నారు. బట్టీల లో తయారైన ఇటుకల అమ్మకాలను బట్టి గ్రామ పంచాయితీలకు పన్నులు చెల్లించాలి. ఒక్కో ఇటుక రూ. 8 నుంచి రూ. 12 వరకు విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులు కోట్ల రూపాయాలు ఆదాయం పొందుతూ గ్రామాలకు చెల్లించే పన్నులు ఎగవేస్తున్నారు. దీనివలన గ్రామాలకు సమకూరే ఆదాయం భారీగా నష్టపోతున్నారు. అయినప్పటికీ జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించడంలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆసలే పంచాయతీలకు నిధుల కొరత తో ఇబ్బందులు పడుతుంటే పన్నులు కూడా రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.

రెవెన్యూ నిర్లక్ష్యం

ఇటుకల బట్టీల నిర్వహణ పై పర్యవేక్షణ చేయడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. రైతులు తమ భూములను వ్యాపారులకు లీజులకు ఇచ్చి అటు వ్యాపారుల నుంచి లీజు అద్దె , ప్రభుత్వం అందించే రైతు బంధు తీసుకుంటున్నారు. అలాంటి వివరాలు అధికారులకు తెలిసిన చర్యలు తీసుకొలేదని ఆరోపణలు ఉన్నాయి. నాలా కన్వర్షన్ చేయకుండా వ్యాపారాలకు ఎలా వినియోగిస్తారని కోణంలో విచారణ చేయనందున బట్టీల ఇష్టారాజ్యంగా నిర్వహణ సాగిస్తున్నారు.

ప్రత్యేక విద్యుత్ అనుమతులేక్కడ

ఇటుకల బట్టీల వ్యాపారాలకు గ్రామ పంచాయితీ , నాలా కన్వర్షన్ , పొల్యూషన్ అధికారుల అనుమతులు ఉన్నపుడే విద్యుత్ సరఫరాకు అనుమతులు ఇవ్వాలి. కానీ విద్యుత్ అధికారులు ఎలాంటి అనుమతులు లేని బట్టీలకు విద్యుత్ కనెక్షన్ లు అందజేశారు. ఇటుకల వ్యాపారాలకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ల ద్వారా విద్యుత్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వ్యవసాయ మోటార్లకు సరఫరా చేసే విద్యుత్ లైన్ ద్వారా నే అందజేస్తున్నారు. విద్యుత్ మీటర్లు ఇష్టానుసారంగా ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. బట్టీల వద్ద రాత్రిపూట గ్రామాలను తలపించే విద్యుత్ దీపాలు మిరుమిట్లుగొలుపు తున్నాయి. రాత్రి వేళల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని సమాచారం. అయినప్పటికి విద్యుత్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

భద్రత లేని కూలీల బతుకులు

ఇటుక బట్టీలే అనుమతులు లేకుండా నిర్వహణ సాగుతుంటే ఇక్కడ పని చేసే కూలీలకు భద్రత కరువైంది. ఈ పనులకు ఒడిశా, చత్తీస్‌గఢ్ ,ఇతర రాష్టాలనుంచి కూలీలను వ్యాపారులు ఇక్కడకు తీసుకొస్తారు. ఇక్కడ పనిచేసే వాళ్ల లో బాల కార్మికులు ఉన్నప్పటికి లేబర్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది. పర్యవేక్షణ లోపం స్పష్టంగా కన్పిస్తుందని ప్రజలు వాపోతున్నారు.

ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం

మాడ్గులపల్లి మండలం గండ్రవారిగూడెం గ్రామంలో 12 ఇటుక బట్టీలు గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. గ్రామానికి దగ్గరగా ఉండి బుడిద వస్తుందని కలెక్టర్ ,ఎంపీడీవో , తహశీల్దార్లకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ప్రజలు పేర్కొంటున్నారు .

కాలుష్య నియంత్రణ ఏదీ

ఇటుకల బట్టీల నిర్వహణలో కాలుష్యపు అధికారుల నియంత్రణ ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామాలకు , ప్రధాన రహదారులకు దూరంగా ఉండాలనే నిబంధన ను పాటింప చేయడంలో అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. పొగ , బూడిద వలన చర్మ వ్యాధులు , ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పొల్యూషన్ అధికారులు తనిఖీలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.



Next Story

Most Viewed