యాదాద్రి నారసింహుడి బ్రహ్మోత్సవాలకు వేళాయే.. "

by Mahesh |   ( Updated:2024-03-10 09:40:18.0  )
యాదాద్రి నారసింహుడి బ్రహ్మోత్సవాలకు వేళాయే..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 11 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. 17న ఎదుర్కోలు, 18న తిరు కళ్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం జరుపుతారు. సోమవారం ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు.

సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు క్రతువులు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.‌ ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

రేపు యాదాద్రికి సీఎం రేవంత్ రెడ్డి..

యాదాద్రి స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు యాదాద్రికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారు. ఉదయం 8.45 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 9 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 9.30 గంటలకు యాదాద్రి ఆలయానికి చేరుకుంటారు. బ్రహ్మోత్సవ ప్రారంభ పూజలలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి 10.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11 గంటలకు హెలికాప్టర్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి భద్రాచలం, మణుగూరులో జరిగే కార్యక్రమాలలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మరి కొంతమంది మంత్రులు సైతం హాజరు అవ్వనున్నారు.



Next Story

Most Viewed