కేసీఆర్ బహిరంగ సభను పార్టీలకతీతంగా బహిష్కరించండి

by Sridhar Babu |
కేసీఆర్ బహిరంగ సభను  పార్టీలకతీతంగా బహిష్కరించండి
X

దిశ,చండూరు : జిల్లా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టటానికే కేసీఆర్ నల్లగొండలో సభ పెడుతున్నారని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో అంటకాగి కేఆర్ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పజెప్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు నైతిక విలువలు ఉంటే వెంటనే రాజకీయాల నుంచి విరమించుకోవాలని సూచించారు. 2014లో ముఖ్యమంత్రి హోదాలో ఎస్ఎల్బీసీని కూర్చి వేసుకుని పూర్తిచేస్తా అనిచెప్పి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసారని అన్నారు. ఆ తర్వాత శివన్నగూడెం రిజర్వాయర్ పూర్తి చేస్తా అని చెప్పి నేటివరకు పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ నల్గొండకు వస్తున్నాడో సమాధానం చెప్పాలని నిలదీశారు.

ఇప్పటివరకు ఆయా ప్రాజెక్టుల కింద ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ, భూనిర్వాసితులకు న్యాయం జరగకపోవటం అప్పటి ప్రభుత్వ దివాలకోరుతనానికి నిదర్శనమన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుండి దిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుండి నీళ్లు తీసుకురావాలనే విషయం పై ఇప్పటికీ కేసీఆర్ కు క్లారిటీ లేదన్నారు. ఈ ప్రాజెక్టులకు నార్లాపూర్ నుండి తీసుకొస్తారా వట్టెం నుండి తీసుకొస్తారా ఇంతవరకు డిసైడ్ చేయలేదన్నారు. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లను పిలిచి రైతులను భూ నిర్వాసితులను, పేదవాళ్లను ఆగం చేసి కేసీఆర్ రిజర్వాయర్లను కట్టాడన్నారు. రిజర్వాయర్లకు నీరు తీసుకువచ్చే కాలువలు తవ్వకాలే నేటికి పూర్తికాలేదని ఎద్దేవా చేశారు. హెడ్ వర్క్స్ టెండర్లు పిలవకుండానే రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ కు దక్కుతుందన్నారు.

బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆగం చేసిన రాష్ట్రాన్ని ఇప్పుడు తాము గాడిలో పెడుతున్నాం అని తెలిపారు. నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, జగదీశ్ రెడ్డి అని అన్నారు. అటువంటి వ్యక్తులు నల్గొండ ప్రజలపై దొంగ ప్రేమ చూపిస్తామని సభ పెడుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా గమనించాలని సూచించారు. నల్గొండ ప్రజలు పార్టీలకతీతంగా కేసీఆర్ సభను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లె వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ దొటి సుజాత వెంకటేష్ యాదవ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ కలిమికొండ జనార్దన్, నల్లగంటి మల్లేష్, బీమానపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed