సూర్యాపేటలో రక్తమోడుతున్న రహదారులు ....

by Kalyani |
సూర్యాపేటలో రక్తమోడుతున్న  రహదారులు ....
X

దిశ , సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఇటీవల 10 రోజుల కాలంలో 12 మంది రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. హైదరాబాద్--విజయవాడ జాతీయ రహదారి 65 పై వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో వాహన దారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈనెల 4న ఆంజనాపురి కాలనీ వద్ద ఆటో,లారీ, కార్ల ద్వారా జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు,ఇద్దరు ఉపాధ్యాయినీలు,మరో వృద్ధురాలు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈనెల 8న సూర్యాపేట మండలం రాజనాయక్ తండా వద్ద అర్వపల్లి మండలానికి చెందిన ఓ యువకుడు రాత్రి వేళ ప్రయాణం చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ నెల 10న సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామ రోడ్డులో ఓ యువకుడి మృత్యువాత పడగా, ఈనెల 11న నల్గొండ జిల్లా కేతేపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ఇదే జాతీయ రహదారి 65 పై ఎర్టిగా కారులో ప్రయాణం చేస్తుండగా అదుపు తప్పి రాజుగారి తోట హోటల్ వద్ద ప్రమాదానికి గురి కావడంతో స్పాట్ లోనే నవీన్, సాయి అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాడు. కారులో ఉన్న మరో ముగ్గురు యువకులు పారిపోయారు. తాజాగా గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ -- విజయవాడ జాతీయ రహదారి ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా,మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో స్థానికులు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై స్ధానికులు తెలిపిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి...

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తున్న డీసీఎంని దాని వెనక నుంచిఅతి వేగంగా వచ్చిన కారు ఖమ్మం ఫ్లైఓవర్ పై ఢీ కొట్టడంతో సూర్యాపేటకు చెందిన ముగ్గురు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మొత్తం నలుగురు యువకుల్లో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మరికొద్ది రోజుల్లో న్యూజిలాండ్ వెళ్లాల్సి ఉన్న నవీద్ అనే ఓ యువకుడు రంజాన్ పర్వదినాన స్నేహితులకు విందు ఏర్పాటు చేశారు.

పార్టీ ఇచ్చిన అనంతరం తమ ఇళ్లకు వెళ్లేందుకు బయలు దేరిన యువకులు జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన వెన్న నిఖిల్ రెడ్డి,గుండె గాని రాకేష్, మహమ్మద్ నవీద్ అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాద ఘటన సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి తీవ్రంగా గాయపడిన ఆదిత్యను ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్ధానిక పోలీసులు ఈ ప్రమాద ఘటన సంబంధిత మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.



Next Story

Most Viewed