12 ఎంపీ సీట్లతో బీజేపీ విజయం సాధిస్తుంది

by Naresh |
12 ఎంపీ సీట్లతో బీజేపీ విజయం సాధిస్తుంది
X

దిశ, నకిరేకల్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి జోష్యం చెప్పారు. అధికారం వస్తే చాలు.. ముఖ్యమంత్రి అయితే చాలు అనే రీతిలో అమలు కానీ హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, నార్కట్ పల్లి, కట్టంగూరు, చిట్యాల, రామన్నపేట మండలాల్లో పర్యటించి ఈ విధంగా మాట్లాడారు. కెమెరాల ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒక విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. రాజకీయంలో హుందాతనం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేసిన సీఎం ఎటువంటి నివేదికలు అందించలేదని కేవలం శ్వేతపత్రం రిలీజ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఇది సరైనది కాదన్నారు. వెంటనే ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్లు ప్రజలను మోసం చేసి మళ్లీ మీటింగులు పెట్టడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ కంకణం కట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారన్నారు గత సీఎం అడగలేదు కాబట్టే నిధులు ఇవ్వలేదని వివరించారు. వికసిత భారత్ లక్ష్యంగా మోడీ ముందుకెళ్తున్నారన్నారు. అబద్ధం, అసత్యం ,నెరవేర్చని హామీలను మోడీ ఏనాడు ఇవ్వరన్నారు. కొనుగోలు చేసిన సర్వేతో కాంగ్రెస్ పార్టీ కంగుతిందని తెలిపారు. 59 శాతం ఓటు బ్యాంకుతో బీజేపీ అభ్యర్థులు రాష్ట్రంలో గెలవబోతున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటేనని మండిపడ్డారు. ఆరుగ్యారంటీలను అమలు చేయలేక రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వలేదని చేతులెత్తేసే విధంగా సీఎం మాట్లాడారని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, నాయకులు గోలి ప్రభాకర్, మండల వెంకన్న, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed