ఉద్రిక్తతల నడుమ పీఏసీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం

by Kalyani |
ఉద్రిక్తతల నడుమ పీఏసీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
X

దిశ,మోత్కూరు: మోత్కూరు రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక రెడ్డి పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఉద్రిక్తతల నడుమ నెగ్గింది. జిల్లా కో ఆపరేటివ్ అధికారికి వైస్ చైర్మన్ తో పాటు తొమ్మిది మంది సంతకాలతో కూడిన లేఖను ఇవ్వగా నేడు అవిశ్వాస తీర్మానం పై సమావేశం నిర్వహించేందుకు డిసిఓ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం పై సమావేశం నిర్వహించాల్సి ఉండగా డిసిఒ ఆలస్యంగా రావడమే కాకుండా చైర్మన్ తో కలిసి రావడంతో క్యాంపు నుంచి సమావేశానికి వచ్చిన డైరెక్టర్లు ఆందోళనకు దిగారు.

ఈనెల 18 వరకు అవిశ్వాసం పై సమావేశం నిర్వహించకుండా కోర్టు స్టే ఇచ్చిందని చైర్మన్ డి సి ఓ ను కోరగా తనకు అలాంటి ఆదేశాలు ఏమీ అందలేదని డిసిఒ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించగా 9 మంది డైరెక్టర్లు గుర్రం లక్ష్మి నరసింహ రెడ్డి, పేలపూడి వెంకటేశ్వర్లు,ఆకుల వెంకన్న, బుషిపాక సుజాత, బండ పద్మ ,తాళ్లపల్లి స్వామి, బయ్యని చంద్రశేఖర్,జిట్టలక్ష్మణ్,కారుపోతుల ముత్తయ్యచైర్మన్కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు డిసిఓ ప్రకటించారు.

అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రక్రియ ముందే నిర్వహించాల్సి ఉండగా డిసిఒ ఆలస్యంగా రావడంతో అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సమయానికి సుమారు గంటకు పైగా ఆలస్యం కావడంతో సహకార సంఘం పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు సారథ్యంలో స్థానిక ఎస్సై ఏశ్రీకాంత్ రెడ్డి సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణ సంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు

ఇది అరాచక అవిశ్వాసం: పిఎసి మాజీ చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి

తనపై అవిశ్వాసం ప్రకటిస్తూ డైరెక్టర్లు నోటీసు ఇచ్చిన వారిలో ముగ్గురు సమావేశాలకు రాని కారణంగా వారి సభ్యత్వాలను తొలగించినప్పటికీ వారిని కొనసాగిస్తూ అవిశ్వాస తీర్మానం నిర్వహించడం సహకార చట్టం నిబంధన ప్రకారం విరుద్ధమని అన్నారు. అధికార పార్టీ నాయకులు తనను పదవి నుంచి తొలగించేందుకు దొడ్డిదారి పద్ధతులను అవలంబించి అరాచక పరిస్థితులు సృష్టించారని కంచర్ల అశోక రెడ్డి ఆరోపించారు. తాను న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తానని అశోక్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed