సర్కార్ పాఠశాలల్లో ఏఐ బోధన

by Kalyani |
సర్కార్ పాఠశాలల్లో ఏఐ బోధన
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: తెలంగాణలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌(ఏఐ) ద్వారా బోధించాలని నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతుల విద్యార్థులకు ఈ బోధన చేపట్టనున్నారు. మారుతున్న టెక్నాలజీని అందిపుకొచ్చని విద్యలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 15వ తేదీ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని 9 పాఠశాలలను ఎంపిక చేసి ఏఐతో పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులను గ్రూప్‌గా చేసి ఏఐ ద్వారా బోధిస్తారు. వాళ్ల సిలబస్‌లో ఉన్న పాఠాలనే ఈ కోర్సులో చేర్చారు. వాళ్లకు అర్థమయ్యే సరళమైన భాషలో నేర్పిస్తారు. వాళ్లకు అర్థం కాకుంటే ఇంకా మరింత సులభంగా నేర్పించనున్నారు. భిన్నమైన వెర్షన్స్‌లో పిల్లలకు ఈ కోర్సు అందిస్తారు.

తొమ్మిది పాఠశాలలో.....

చౌటుప్పల్ మండలంలోని జై కేసారం ప్రాథమిక పాఠశాల, దేవులమ్మ నాగారం, భువనగిరి మండలంలోని తుక్కాపురం, మోటకొండూరు మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, ఆలేరు మండలంలోని కొల్లూరు, రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం, యాదగిరిగుట్ట మండలంలోని పెద్ద కందుకూరు, బీబీనగర్ మండలంలోని జమీలపేట్, యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న కంప్యూటర్లను ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమానికి వినియోగిస్తున్నారు.

9 పాఠశాలలు, 89 మంది విద్యార్థులు....

జిల్లా వ్యాప్తంగా 9 పాఠశాలల్లో 89 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఏఐ ద్వారా పాఠాలు పిల్లలకు అర్థమయ్యే ఈజీ లాంగ్వేజ్‌లో ఈ పాఠాలు ఉంటాయి. వీటి ద్వారా చదువులో వెనుకబడిన పిల్లల్లో మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక విద్యా స్థాయిలో ఏఐ ఆధారిత టూల్స్ ఉపయోగించి విద్యార్థుల్లో రాసే, చదివే స్కిల్స్‌ను మెరుగుపరచనున్నారు. వారిలో చిన్న చిన్న లెక్కలు చేసుకునేలా అవగాహన కల్పించనున్నారు. కాస్త మెరుగ్గా ఉన్న విద్యార్థులకు అడ్వాన్స్డ్ విషయాలను నేర్పిస్తారు. వారిలో బలహీనతలు గుర్తించి వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలు కూడా తెలియజేస్తారు. దీని ద్వారా అందరి విద్యార్థులకు లెవల్‌ప్లేయింగ్‌ ఫీల్డ్ సెట్ చేయనున్నారు. ఇందులో ఉపాధ్యాయులకు కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. బోధనలో టెక్నాలజీ వాడకంపై వాళ్లకు శిక్షణ ఇస్తారు.

విద్యార్థులలో నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది : కందుల సత్యనారాయణ, డీఈవో, యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 ప్రాథమిక పాఠశాలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికి సంబంధించి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ పూర్తి అయింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థుల నుంచి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. విద్యార్థులలో కూడా తప్పకుండా నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. దీనిని మేము ప్రత్యేకంగా గమనిస్తున్నాం.



Next Story

Most Viewed