- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించలే.. మునుగోడులో పని చేయని సానుభూతి

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్కు మునుగోడు ఉప ఎన్నిక కలిసి రాలేదు. ఓవైపు సీనియర్లు దూరం పాటించగా.. సానుభూతి వర్కౌట్అవుతుందని భావించినా బెడిసికొట్టింది. ఆడబిడ్డ, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలు అంటూ ప్రచారం చేసినా ఓటర్లు కనికరించలేదు. మునుగోడులో ఓడించి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నట్లుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ను బతికించాలంటూ వేడుకున్నారు. రేవంత్ కన్నీటి అప్పీల్కూడా అనుకూలంగా మారలేదు. మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలున్నాయి.
ముందుకు తీసుకువచ్చి.. వదిలేశారు
కాంగ్రెస్ తరుపున మునుగోడులో పోటీ చేసేందుకు పాల్వాయి స్రవంతితో పాటుగా వ్యాపారస్తుడు కృష్ణారెడ్డి, కైలాస్నేత, పల్లె రవి పోటీ పడ్డారు. కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు ఎంపీలు వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి సహా పలువురు స్రవంతికి టికెట్ఇవ్వాలని ఏఐసీసీ ముందు పట్టుబట్టారు. దీంతో స్రవంతికి టికెట్ఖరారు చేశారు. కానీ, ప్రచారంలో మాత్రం ఈ నేతలంతా దూరంగా వ్యవహరించారు. ఎంపీ వెంకట్ రెడ్డి ఒక్క పూట కూడా తిరుగలేదు. పార్టీ నేతలకు కనీసం ప్రకటన కూడా చేయలేదు. అంతేకాకుండా ఆయన తన తమ్ముడు రాజగోపాల్రెడ్డికి అనుకూలంగా పని చేశారనే అపవాదు కూడా ఉంది. మరో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రచారంలో తక్కువగా కనిపించారు. జోడో యాత్ర పేరుతో రాహుల్వెంటే ఉన్నారు. ఇక జానారెడ్డి అసలు ఉన్నారా.. లేరా అన్నట్టే ఉన్నారు. వీరంతా కలిసి చేస్తే కనీసం 40 వేల ఓట్లు దాటే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
సానుభూతి రాలే
అన్ని పార్టీల కంటే ముందుగానే పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని మొదలుపెట్టారు. కొన్నిచోట్ల నేతలు కలిసి రాకున్నా ఒంటరి పోరు చేశారు. అయితే, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డగా, కాంగ్రెస్పార్టీ కోసం ముందు నుంచీ పని చేస్తున్న తనకు మద్దతుగా ఉండాలంటూ ఓటర్లను వేడుకున్నారు. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి కూడా మునుగోడు సెగ్మెంట్లో ప్రచారం సందర్భంగా కంటతడి పెట్టారు. ఈ ఉప ఎన్నిక సాకుగా కాంగ్రెస్ను చంపేయాలని చూస్తున్నారని, తనను పదవి నుంచి తప్పించే కుట్రలు కూడా చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ బతుకాలంటే మునుగోడులో స్రవంతి గెలువాలని కోరారు. కానీ, ఓటర్లు కనికరించలేదు.
Read more :
1. మునుగోడులో కాంగ్రెస్కు భారీ షాక్.. డిపాజిట్ కోల్పోయిన పాల్వాయి స్రవంతి