- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
తల్లిని చంపి బిడ్డను తీశారని ఇంకెన్నిసార్లు అవమానిస్తారు..? ప్రధాని మోడీపై KTR ఫైర్

దిశ, వెబ్డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై లోక్సభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదని.. చర్చ లేకుండా హడావుడిగా రాష్ట్రాన్ని విభజించి యూపీఏ సర్కార్ చేతులు దులుపుకుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ను దారుణంగా విభజించారన్నారు. వాజ్పేయీ హయాంలోనూ దేశంలో రాష్ట్రాల విభజన జరిగిందని.. అప్పుడు విడిపోయిన రాష్ట్రాలు సంబరాలు చేసుకున్నాయి.. కానీ యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదన్నారు. కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటైనా తెలంగాణ, ఏపీలో ప్రజలు సంబరాలు చేసుకోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, రాష్ట్ర విభజనపై మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసి వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దిగ్భ్రాంతి కలింగించాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మోడీ అవమానించడం ఇదే తొలిసారి కాదని, చారిత్రక వాస్తవాల పట్ల మోడీ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందన్నారు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లు పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ అవిర్భావ వేడుకలు జరుపుకోలేదనడం పూర్తి అవాస్తవమని అన్నారు. పార్లమెంట్లో మోడీ చేసిన వ్యాఖ్యలు అజ్ఞానం, అహంకారంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ను విమర్శించే ప్రయత్నంలో మోడీ తెలంగాణను అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాలు, భావోద్వేగాలను మోడీ పరిగణించాలని సూచించారు.
మోదీ.. తెలంగాణ విరోధి అంటూ ట్విట్టర్ వేదికగా కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
‘‘తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకు ప్రధాని..? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం..? తెలంగాణ అంటేనే గిట్టనట్టు.. పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..? తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు.. మా అస్తిత్వాన్ని అవమానిస్తారు..? పద్నాలుగేండ్లు పోరాడి..దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకు..? ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని.. మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారు మీరు..?వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని.. మా రైతుల్ని కించపర్చిండు.. మీ కేంద్రమంత్రి.. ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా.. మీలాగే మీ మంత్రులు..! మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వరు.. కనీసం.. మాటల్లోనైనా మర్యాద చూపించండి..!
కోటి ఆశలు.. ఆకాంక్షలతో పురుడుపోసుకొన్న కొత్త రాష్ట్రానికి సహకరించక పోగా.. ఆదినుంచి కక్షను పెంచుకొని.. వివక్షనే చూపిస్తున్నారు మీరు..! ఏడు మండలాలు గుంజుకొని.. లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోం..! నీతి ఆయోగ్ చెప్పినా నీతిలేకుండా మిషన్ కాకతీయ.. భగీరథలకు నిధులను నిరాకరించిన మీ నిర్వాకాన్ని ఏమనాలి..? కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా అర్థంచేసుకోవాలి..? కాజీపేట కోచ్ ఫాక్టరీని గుజరాత్కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా..? 157 మెడికల్ కాలేజీల్లో ..ఒక్కటి ఇవ్వకుండా గుండుసున్నా చేసారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపమో కదా..! పైన అప్పర్ భద్ర.. కింద పోలవరం.. ఇంకెక్కడో కెన్బెత్వాకు జాతీయ హోదాఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు.. మేం చేసిన పాపమేంది..?
బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి.. గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి.. ఆదివాసులపై కక్షసాధిస్తున్నారు ఎందుకు..? సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేస్తరు.. ఐటీఐఆర్ను రద్దు చేస్తరు.. హైదరాబాద్కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు.. మీరు నిధులివ్వరు.. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తరు..! అడుగడుగునా దగా.. ప్రశ్నిస్తే పగ జుమ్లా.. హమ్లా డబుల్ ఇంజన్ సర్కారు మీది..! ఈడీ.. ఐటీ.. సీబీఐలను మీ ఎన్డీయే కూటమిలో చేర్చుకొని.. ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్నమీకు.. పొద్దున లేచి ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం.. విచిత్రం..! డబుల్ ఇంజన్ నినాదంతో ఊదరగొట్టే మీకు తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు.. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా..!’’ అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.