మిసెస్‌ ఇండియా దివా 2025 విజేత ఎవరో తెలుసా

by Sumithra |
మిసెస్‌ ఇండియా దివా 2025 విజేత ఎవరో తెలుసా
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రతిష్టాత్మకమైన మిసెస్‌ ఇండియా దివా సీజన్‌ - 6 గ్రాండ్‌ ఫినాలేలో హైదరాబాద్‌కు చెందిన బోయిన్‌పల్లి వాసి ప్రియాంక సందూరి విజేతగా నిలిచారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ నగరంలో ఇటీవల దివా బ్యూటీ పేజెంట్‌ నిర్వహించిన ఈ పోటీలో దేశంలోని పలు నగరాల నుండి 3500 పైగా దరఖాస్తులు అందగా, ఇందులో 32 మందిని ఫైనల్స్‌కు ఎంపిక చేశారు.

ఈ పోటీల్లో నడక, నడత, టాలెంట్‌ రౌండ్‌, నేషనల్‌ కాస్ట్యూమ్స్‌, ప్రశ్నోత్తర రౌండ్స్‌ , ర్యాంప్ వాక్.. అన్నింటిలోనూ ప్రియాంక సందూరి తమ ప్రతిభను కనబరిచారు. విశేషంగా, ఆమె అమ్మవారి వేషధారణలో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న గృహహింస, వరకట్న వేధింపుల పై నాటక రూపంలో ఆమె ప్రదర్శన ఇచ్చారు.

లండన్‌లో స్థిరపడిన ప్రియాంక సందూరి, మిసెస్‌ ఇండియా దివా 2025 గా విజేతగా నిలిచిన అనంతరం జూబ్లిహిల్స్ లో మీట్ అండ్ గ్రీట్ లో మీడియాతో ముచ్చటించారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి ఏకైక మహిళగా టైటిల్ గెలవడం గర్వకారణంగా ఉందని ప్రియాంక సందూరి అన్నారు. మహిళలు తమ బహుముఖ శక్తిని ప్రదర్శించడమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు వేదికని అన్నారు.

జ్యూరీలుగా డాక్టర్‌ యశ్వర్థన్‌ రణావత్‌, డాక్టర్‌ లోకేశ్వరి రాథోర్‌, రీనా తోష్నివాల్‌, బినీ భట్‌ (మిస్‌ ఎర్త్‌ 2022) వ్యవహరించిన ఈ ఫినాలేకు అతిధులుగా హాజరైన ఎఫ్కా పురోహిత్‌, బాలీవుడ్‌ సంగీత దర్శకుడు హర్షవర్థన్‌ శ్రీవాస్తవలు సందూరిని సత్కరించి టైటిల్ ను అందజేశారు.



Next Story

Most Viewed