బీజేపీ వైపే ప్రజల మద్దతు.. మోదీతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి : ఈటల

by Disha Web Desk 23 |
బీజేపీ వైపే ప్రజల మద్దతు.. మోదీతోనే  అన్ని రంగాల్లో అభివృద్ధి : ఈటల
X

దిశ, కాప్రా : దేశ ప్రజలు బీజేపీ నాయకత్వాన్నే బలపరుస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం ఫోరం టు ఇంప్రూవ్ థింగ్స్ (ఫిట్) ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ కిన్నెర గ్రాండ్ హోటల్ లో నిర్వహించిన సమావేశంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోరం టు ఇంప్రూవ్ థింగ్స్ ఈటలకు మద్దతు ప్రకటించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ , గండే సుధాకర్, రాక సుధాకర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలోనే అద్భుత శక్తిగా ఎదుగుతున్న భారత దేశం కోసం, మేక్ ఇన్ ఇండియా, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో భారత్ ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలని కోరారు.

దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా నినాదంతో వందే భారత్ రైలును ప్రవేశపెట్టారని, కరోనా వైరస్ కు కోవాగ్జిన్ మందును కనిపెట్టి 130 కోట్ల భారతీయులకు ఉచితంగా అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకు అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశారని, సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ ను, ఉగ్రవాదులను తరిమికొట్టారని తెలిపారు.

చంద్రయాన్ 3 చేపట్టి విజయం సాధించారని కొనియాడారు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మించి బాలరాముడిని ప్రతిష్టించారని తెలిపారు. అటక్ నుండి కటక్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలను, ఓటర్లను చైతన్య పరిచి ప్రతి ఒక్కరూ ఓటేసేలా చూసి మూడవసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేయాలన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అబ్ కీ బార్ మోడీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం ప్రజల్లో పుట్టిందన్నారు. భారతదేశ అభివృద్ధిని చూసి నరేంద్ర మోడీకి ఓటు వేయాలని తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని నేనన్నారు. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ నరేంద్ర మోడీ అన్నారు. నరేంద్ర మోడీని వ్యతిరేకించేందుకు కేసీఆర్ కి అయిదారు సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డికి మూడు నెలలు మాత్రమే పట్టిందని విమర్శించారు. రేపటి చరిత్ర మోడీదే అన్నారు. అందరూ గొప్పగా పనిచేసి అటు మోడీని, మల్కాజిగిలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.

Next Story